అరకు, ఆదిలాబాద్లో గజగజ.. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు...
తెలుగురాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఉదయం 8.30 గంటల వరకు కూడా మంచు కనిపిస్తోంది. 9 గంటల తర్వాతే సూర్యుడు ఉదయిస్తున్నాడు. అరకు, ఆదిలాబాద్లో చలి తీవ్రత మరింత పెరిగింది.
చలితో విశాఖపట్టణం, ఆదిలాబాద్ మారుమూల ప్రాంతాలు చలికి గజ గజ వణికిపోతున్నారు. చలికి జనాలు మంట కాచుకొంటున్నారు. అరకులో అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్లో 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోవడంతో జనాలు స్వెట్టర్లు వేసుకొని, రగ్గులను కప్పుకుంటూ ఉపశమనం పొందుతున్నారు.
ఇటు హైదరాబాద్లో కూడా 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో ఉదయం, రాత్రికూడా చలిగాలులు పెడుతున్నాయి. చలిగాలుల నుంచి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి 3 వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు.