విశాఖ ఎయిర్పోర్టులో మళ్లీ కత్తి కలకలం.. ఇది కోడికత్తి కాదు వేటకొడవలి
విశాఖపట్నం విమానాశ్రయం భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది అక్టోబరులో అత్యంత భద్రతతో కూడిని విమానాశ్రయంలోకి కోడికత్తి తీసుకుని శ్రీనివాస్ అనే వ్యక్తి వైసీపీ అధినేత జగన్ పై దాడి చేశాడు. ఆ ఘటన మరువకముందే వేటకొడవలి విమానాశ్రయంలో కలకలం సృష్టించింది. ఈ వేటకొడవలి తీసుకొని ఓ వ్యక్తి లోపలికి ప్రవేశిస్తుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. పార్కింగ్ ఇన్ గేట్ వరకు వెళ్లిన ఈ వ్యక్తిని సీఆర్పీఎఫ్ బలగాలు పట్టుకుని ఎయిర్పోర్టు పోలీసులకు అప్పజెప్పాయి.
వేటకొడవలితో లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని లోవరాజుగా పోలీసులు గుర్తించారు. ఆయన విశాఖ జిల్లా పరవాడకు చెందినవాడని పోలీసులు తెలిపారు. అసలు వేటకొడవలితో విమానాశ్రయ పరిసరాల్లో ఎందుకు సంచారం చేస్తున్నాడనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీని వెనక ఏమైనా కుట్రదాగుందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అంతేకాదు కత్తిపట్టుకుని అంత దూరం ఎలా వచ్చాడనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో విమానాశ్రయంలో వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఉన్నట్లు తెలుస్తోంది.
వైసీపీ చీఫ్ జగన్పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాస్కు గురువారం ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వాదనలు విన్న న్యాయస్థానం శ్రీనివాస్కు బెయిల్ మంజూరు చేసింది. శనివారం నాటికి శ్రీనివాస్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఎన్నికల ఫలితాల రోజున శ్రీనివాస్కు బెయిల్ రావడంపై పెద్ద చర్చకే తావిస్తోంది. ఇక జగన్ పై దాడి చేసిన సమయంలో విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయలేదని వైసీపీ నేతలు ఆరోపించారు. అత్యంత భద్రతతో కూడిన విమానాశ్రయంలో ఓ వ్యక్తి కత్తి తీసుకుని దాడి చేశాడంటే నాటి చంద్రబాబు ప్రభుత్వ డొల్లతనం బయటపడిందని వైసీపీ విమర్శించిన సంగతి తెలిసిందే.