సింహాచలం దేవస్థానంలో ఫోరెన్సిక్ ఆడిట్: టీడీపీకి ఎందుకు వణుకు: సంచైత
విశాఖపట్నంః తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడిపై మన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం పాలకమండలి ఛైర్పర్సన్ సంచైత గజపతి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమాలు వెలుగులోకి వచ్చే సమయం దగ్గర పడిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని రెచ్చిపోయారని, ఆలయ ఆస్తులను కాజేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఆదివారం వరుస ట్వీట్లను సంధించారు.
జగన్ సర్కార్కు ఏపీ హైకోర్టు నుంచి మరో స్టే: ఇక వారిపై సీఐడీ దర్యాప్తునకు బ్రేక్
సింహాచలం దేవస్థానంలో ఫోరెన్సిక్ ఆడిట్ను మొదలు పెట్టారని, దీనివల్ల తెలుగుదేశం నాయకుల అక్రమాలు, తప్పులు వెంటాడుతాయనే భయాందోళనలు ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, మద్దతుదారులు, సానుభూతిపరులు ప్రతిష్ఠాత్మక సింహాచలం ఆలయ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దేవాలయ భూములను ఆక్రమించడం నిజం కాదా? అంటూ ఆమె అయ్యన్నపాత్రుడిని నిలదీశారు.
అయ్యన్నపాత్రుడు రాష్ట్రం, జిల్లా రాజకీయాల్లో సీనియర్ అని, అలాంటి నాయకుడు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేయడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సహేతుకం కాదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక గజపతి రాజు సోదరుడు ఆనంద గజపతిరాజు పెద్ద కుమార్తె అనే విషయాన్ని విస్మరించ వద్దని గుర్తు చేశారు. సింహాచలం దేవస్థానంలో ఫోరెన్సిక్ ఆడిట్ అనే పేరు వింటే చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని చెప్పారు.
టీడీపీకి చెందిన అశోక గజపతి రాజు సింహాచలం దేవస్థానం ఛైర్మన్గా ఉన్న కాలంలో ఆలయానికి చెందిన విలువైన వస్తువులు మాయం అయ్యాయని ఆరోపణలు వచ్చిన విషయాన్ని మరిచిపోయారా? అని ఆమె అయ్యన్నపాత్రుడిని నిలదీశారు. అయిదేళ్లుగా దేవాలయ ఆస్తులపై లెక్కలు ఎందుకు సరిగ్గా రాయలేదని, దేవాలయానికి వచ్చే రాబడి, ఖర్చులు చెప్పే ఖాతాలను సరైన పద్ధతిలో ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించారు.
సింహాచలం కొండ దిగువన ఉన్న దేవస్థానం ఛైర్మన్ బంగళాను అశోక గజపతి రాజు ఇంకా ఖాళీ చేయలేదనే విషయం అయ్యన్నపాత్రుడికి తెలియదని ఎద్దేవా చేశారు. ఆ బంగళా పేరు మీద ఎన్ని బిల్లులను పాలక మండలి పంపించారో తెలుసా? అని సంచైత నిలదీశారు. అశోక గజపతి రాజు తల్లి అదే బంగళాలో ఉన్నారని, ఆమె జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటరనే కారణంతోనే తాను ఇప్పుడా విషయాలను ప్రస్తావించ దలచుకోలేదని సంచైత చెప్పారు.