కలకలం:ఎపిఎఫ్డిసి అధికారులు కాఫీ తోటలను వదిలేసివెళ్లిపోవాలి...మావోయిస్టుల పోస్టర్లు
విశాఖపట్నం:విశాఖ మన్యంలో మారోసారి మావోయిస్టులు పోస్టర్లు కలకలం రేపాయి. తాము గిరిజనులకు పంచిపెట్టిన కాఫీ తోటలను వారికే వదిలేసి ఏపీఎఫ్డీసీ అధికారులు ఏజెన్సీ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ మావోయిస్టులు బ్యానర్లు ,కరపత్రాలు ఏర్పాటుచేయడం సంచలనం సృష్టించింది.
గాలికొండ ఏరియా కమిటీ పేరుతో వెలిసిన ఈ బ్యానర్లు , కరపత్రాలను మావోయిస్టులు గురువారంవెలిశాయి. ఇదిలావుంటే మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడానికే వారోత్సవాలు నిర్వహిస్తూ అలజడి సృష్టిస్తున్నారని విశాఖ ఎస్పీ అట్టాడ బాబూజీ స్పష్టం చేశారు. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలో పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందుపాతర పేల్చిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు.
గిరిజనులకు తాము పంచిపెట్టిన కాఫీతోటలను వారు సాగు చేసుకుంటున్నారని...అడవిపై హక్కు ఆదివాసీలదేనని...గ్రామరాజ్యం కమిటీలతో వారు ఇక్కడి భూమిపై సర్వాధికారం పొందారని...అందువల్ల ఏపీఎఫ్డీసీ అధికారులు ఆ కాఫీ తోటలను గిరిజనులకు వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ గాలికొండ ఏరియా కమిటీ పేరిట పాడేరు మండలం కుంకుంపూడి ఘాట్రోడ్డులో గురువారం బ్యానర్లు,పోస్టర్లు వెలిశాయి.
రెండు రోజుల క్రితమే జి.మాడుగుల మండలం నుర్మతి సమీపంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో తీవ్ర అలజడి రేగిన క్రమంలో మళ్లీ మావోయిస్టులు అధికారులను హెచ్చరిస్తూ కాఫీతోటల వివాదాన్ని తెర మీదకు తేవడంతో ఏంజరగబోతోందోనని గిరిజనులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు.
ఇదిలావుంటే జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పరిధిలో పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందుపాతర పేల్చిన ప్రాంతాన్ని ఎస్పీ అట్టాడ బాబూజీ సందర్శించారు. ఈ ఘటనలో కేంద్ర బలగాలకు చెందిన ఇద్దరు పోలీసులతో పాటు ఒక గిరిజనుడు కూడా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్పీ అట్టాడ బాబూజీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో తమ ఉనికిని కాపాడుకోడానికే మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తూ అలజడి సృష్టిస్తున్నారని...నిజానికి మావోయిస్టు వారోత్సవాల వల్ల గిరిజనులకు ఒరిగేది ఏమి లేదని స్పష్టం చేశారు.
కేవలం అమాయక గిరిజన యువతను బలవంతంగా తమ వైపు తిప్పుకునే లక్ష్యంతో...అలా వారిని భయపెట్టి బలిచేసేందుకే మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహిస్తుంటారని ఆయన తేల్చేశారు. ఇటీవలికాలంలో పోలీసుల ఎదురు కాల్పుల్లో మావోయిస్టు ఉదయ్ భార్య మీనా చనిపోవడం, కీలక మావోయిస్టులు భూతం అన్నపూర్ణ, ముదలి సోనా వంటి పలువురు అరెస్ట్ అయిన నేపథ్యంలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగలడంతో...మళ్లీ బలాన్ని పెంచుకోవడానికే వారు వారోత్సవాలు నిర్వహిస్తున్నారని ఎస్పీ బాబూజీ వివరించారు.