ఎపిలో మరోసారి మావోయిస్టుల కలకలం...విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేలుడు!;విజయవాడలో అరెస్ట్
విశాఖపట్నం:ఎపిలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మందుపాతర పేల్చడం ద్వారా తమ తెగువని చూపించారు. అయితే మావోయిస్టులు జరిపిన ఈ దాడిలో ఓ గిరిజనుడికి గాయం మినహా పెను ముప్పు సంభవించలేదు.
మరోవైపు విజయవాడ నగరంలో ఇద్దరు మావోయిస్టులను తెలంగాణా పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం సృష్టించింది. వీరిని కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, భార్య సారమ్మ అలియాస్ సుజాతగా గుర్తించారు. ఇదిలావుంటే మావోయిస్ట్ పార్టీలో నాయకత్వ మార్పు జరిగినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిథి లేఖను విడుదల చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మందుపాతర...పేల్చిన మావోయిస్టులు
విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం నుర్మతి సమీపంలో మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నుర్మతి పోలీస్ అవుట్ పోస్ట్ నిర్మాణాన్ని నిలిపివేసే లక్ష్యంతో మావోయిస్టులు ఈ మందుపాతర పేల్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మందుపాతర పేలుడులో ఒక గిరిజనుడు గాయపడగా అతడి ప్రాణాలకు ముప్పులేదని తెలిసింది.
విజయవాడలో...మావోయిస్టుల అరెస్ట్
మరోవైపు విజయవాడ నగరంలో కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, భార్య సారమ్మ అలియాస్ సుజాతను తెలంగాణ ఇంటిలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం సృష్టించింది. వీరిరువురు ఏటూరు నాగారం, కొత్తగూడెం ఏరియాల్లో మావోయిస్టు ప్రతినిధులుగా పనిచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న అనంతరం తెలంగాణా పోలీసులు వారిని విచారణ నిమిత్తం కొత్తగూడెం తరలించారు.
నాయకత్వ మార్పు...కొత్త నేత బసవరాజు
ఇదిలావుంటే మావోయిస్ట్ పార్టీ నాయకత్వ మార్పుకు సంబంధించి ఆ పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన ఒక లేఖ పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నూతన కార్యదర్శిగా బసవరాజు అలియాస్ నంబాళ్ల కేశవరావును ఎన్నుకున్నట్లు ఆ పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈ లేఖలో వెల్లడించారు.
గణపతి...తప్పుకున్న కారణం
ఇప్పటివరకు మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా గణపతి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గణపతిని కొంతకాలంగా అస్వస్థతకు గురైన నేపథ్యంలో...పెరిగిన వయోభారం...ప్రస్తుత పరిస్థితుల్లో నాయకత్వం పటిమ మరింత ప్రదర్శించాల్సిన క్రమంలో...ఈ కారణాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గణపతి తన పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు మావోలు లేఖలో వివరించారు. తన స్థానంలో వేరొకరిని నాయకుడిగా నియమించాలని గణపతి పార్టీ సహచరుల ముందు ప్రతిపాదన పెట్టిన నేపథ్యంలో కేంద్రకమిటీ సమావేశంమై...సుదీర్ఘంగా చర్చించి కమిటీ నూతన కార్యదర్శిగా కేశవరావును ఎన్నుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.