విశాఖ మన్యంలో భారీ కూంబింగ్.. అగ్రనేతల వేట.. రేపటి నుంచి మావోల వారోత్సవాలు..
విశాఖ ఏజెన్సీతో పాటు ఏపీ-ఒడిశా సరిహద్దుల్లోనూ మావోయిస్టుల కదలికలు పెరగడం ఏపీ పోలీసులను కలవరపెడుతోంది. కొంతకాలంగా ఇక్కడ మావోయిస్టుల ప్రభావం తగ్గిందని అంచనా వేస్తున్న పోలీసులకు తాజా కదలికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా ఇక్కడ చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు చనిపోవడం, అగ్రనేతలు తప్పించుకుకోవడం, రేపటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ప్రారంభం కానుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మన్యంలో మావోయిస్టుల కదలికలు పెరగడంతో కొన్నిరోజులుగా భారీగా కూంబింగ్ సాగుతోంది. తనిఖీలు కూడా ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో మావోయిస్టులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ అమరవీరుల వారోత్సవాలకు పిలుపునిచ్చారు. వీటిని విజయవంతం చేసే పేరుతో మావోయిస్టులు దాడులకు దిగవచ్చని, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయొచ్చనే సంకేతాలు ఉండటంతో పోలీసులు భారీగా జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా చింతపల్లి, జీకే వీధి రహదారి వెంట ఉన్న కల్వర్టు, ఇతర జంక్షన్లలో బీడీ టీమ్, సీఆర్పీఎఫ్ బలగాలతో తనీఖీలు చేపడుతున్నారు.
ఇటు మావోయిస్టుల కదలికలు, వారి కోసం పోలీసుల వేట కొనసాగుతుండటంతో మన్యంలో గిరిజనులు ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంభయంగా గడుపుతున్నారు. ఇప్పటికే మావోయిస్టుల సమాచారం కోసం పోలీసులు దొరికిన వారినల్లా ప్రశ్నిస్తుండటంతో రేపటి నుంచి వారం రోజుల పాటు ఏం జరుగుతుందో తెలియక గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.