విశాఖలో భారీ చోరీ.. కత్తితో బెదిరించి.. పట్టపగలే దోపిడీ..!
విశాఖపట్నం : గాజువాకలో జరిగిన భారీ దోపిడీ కలకలం రేపింది. పోర్టు రోడ్డులో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. శ్రీనివాస్ అనే వ్యక్తిపై దాడి చేసి 20 లక్షల రూపాయలు దోచుకెళ్లిన ఘటన స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. బుధవారం మధ్యాహ్నం 2.45 నుంచి 3.00 గంటల సమయంలో జరిగిన ఈ దారి దోపిడీ పోలీసులకు సవాల్గా మారింది. శ్రీనివాస్ను అనుసరించిన దుండగులు జన సంచారం లేని ప్రాంతంలో అటాక్ చేసి 20 లక్షల రూపాయలు దోచుకెళ్లడం సంచలనంగా మారింది.
నెల్లూరుకు చెందిన శ్రీనివాస్.. గాజువాక ఇండస్ట్రియల్ ఏరియాలోని సిరి ట్రాన్స్పోర్టులో క్యాషియర్గా పనిచేస్తున్నారు. అయితే కంపెనీ పని నిమిత్తం బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి 19 లక్షల రూపాయల క్యాష్ తీసుకుని మంగళవారం నాడు విశాఖపట్నం చేరుకున్నారు. ఆ డబ్బులతో పాటు మరో లక్ష రూపాయలు గాజువాక ఎస్బీఐ బ్యాంకు నుంచి బుధవారం నాడు డ్రా చేశారు. ఆ 19 లక్షలకు తోడు ఈ లక్ష రూపాయలు కలిపి మొత్తం 20 లక్షల రూపాయలను కంపెనీ ఖాతాలో జమ చేసేందుకు స్కూటీ మీద బ్యాంకుకు బయలుదేరారు.
ఏఎన్ఎంలు టెన్షన్ పడొద్దు.. ఉద్యోగ భద్రతపై అనుమానాలు వద్దు : ఆళ్ల నాని వివరణ
20 లక్షల రూపాయల నగదును స్కూటీ డిక్కీలో పెట్టుకుని బయలుదేరిన శ్రీనివాస్ను ఇద్దరు దుండగులు అనుసరించినట్లు తెలుస్తోంది. అలా పోర్టు రోడ్డుకు చేరుకోగానే జన సంచారం తక్కువగా ఉండటంతో అతడిపై దాడి చేశారు. కత్తితో బెదిరింపులకు పాల్పడుతూ స్కూటీ డిక్కీ తెరిచారు. ఆ క్రమంలో శ్రీనివాస్ ఆ ఇద్దరు దుండగులతో పెనుగులాడినా లాభం లేకుండా పోయింది. అతడిపై పిడిగుద్దులు కురిపించి 20 లక్షల రూపాయలతో పరారయ్యారు.
జరిగిన ఘటనతో లబోదిబోమంటూ హర్బర్ పోలీసులను ఆశ్రయించారు శ్రీనివాస్. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో పట్టపగలే దుండగులు రెచ్చిపోవడంతో విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సహా ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. తనపై అటాక్ చేసిన ఇద్దరు నిందితులు 25 సంవత్సరాల లోపు యువకులు అని చెబుతున్న శ్రీనివాస్ మిగతా వివరాలు అంతగా పరిశీలించలేదని పోలీసులకు వివరించారు. అసలు వాళ్లు ఏ వాహనం మీద వచ్చారోననే సంగతి కూడా టెన్షన్ కారణంగా గ్రహించలేదని తెలిపారు. అయితే అన్నీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.