చిరంజీవికి ఘనస్వాగతం.. విశ్వ నటచక్రవర్తి ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణకు..
సైరా మూవీ విజయం అందించిన ఉత్సాహంతో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ జోష్ పెంచారు. తాజాగా ప్రమోషన్స్ పక్కన పెట్టి విశ్వ నటచక్రవర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తాడేపల్లిగూడెంకు ప్రయాణమయ్యారు. అందుకోసం చిరంజీవి ఆదివారం ఉదయం విశాఖపట్టణానికి చేరుకొన్నారు. గన్నవరం ఎయిర్పోర్టులో చిరంజీవికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అభిమానులు, సన్నిహితులు ఘనస్వాగతం పలికారు.
గన్నవరం నుంచి చిరంజీవి నేరుగా తాడేపల్లిగూడెంకు చేరుకొంటారని నిర్వాహకులు వెల్లడించారు. ఇక అక్కడ ఏర్పాటు చేసిన విశ్వ నటచక్రవర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్, కేయన్రోడ్ లో విగ్రహావిష్కరణకు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి గత నెలలో దివంగత ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించాల్సింది. కానీ చిరంజీవి సైరా నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉండటంతో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. సైరా అనంతరం ఆవిష్కరణకు ఏర్పాట్లు చేసుకోవాలని చిరంజీవి సూచన మేరకు 6 అక్టోబర్ 2019 (ఆదివారం) ఉదయం 10 గంటల తర్వాత ముహుర్తం నిర్ణయించారు. సైరా:నరసింహారెడ్డి ఘనవిజయం నేపథ్యంలో ప్రచారకార్యక్రమాల బిజీలోనూ మెగాస్టార్ ఇచ్చిన మాటకు కట్టుబడి విగ్రహావిష్కరణకు విచ్చేసినందుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, సైరా రిలీజై తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లను రాబడుతున్నది. గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన రిలీజైన ఈ చిత్రం రూ.150 కోట్ల వసూళ్లవైపు పరుగులు పెడుతున్నది. నయనతార, తమన్నా, అనుష్క నటించిన ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన తొలితరం స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి జీవితం ఆధారంగా సైరాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చూడాలని శనివారం తెలంగాణ గవర్నర్ తమిళిసైని చిరంజీవి కలిసి కోరిన విషయం తెలిసిందే.