విశాఖ భూ కుంభకోణంపై సిట్... గజం భూమి కబ్జా చేసినా కఠిన చర్యలు, పీడీ యాక్ట్ అన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి విశాఖ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని జగన్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. చంద్రబాబు హయాంలో ని విశాఖ భూ కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేయడం, నివేదికను సిద్ధం చేయడం తెలిసిన విషయమే. ఇక తాజాగా మరోమారు టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో విశాఖ భూ కుంభకోణం గురించి సిట్ దర్యాప్తు చేయించాలని, గత ప్రభుత్వ హయాంలో చేసిన దర్యాప్తుకు సంబంధించిన నివేదికను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ భూ కబ్జాల విచారణకు సిట్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి అవంతి శ్రీనివాస్
ఇక ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో భూకబ్జాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వేస్తామని, అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే అవంతి వర్సెస్ గంటా ఎపిసోడ్ లో ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న ఇద్దరు నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా గంటా శ్రీనివాస్ వ్యాఖ్యలతో మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ భూ కుంభకోణంపై తనదైన శైలిలో మాట్లాడారు. విశాఖ ల్యాండ్ మాఫియాపై ఉక్కుపాదం మోపి తీరతామని హెచ్చరించారు.
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని గులాబీ ప్రచారం కోసం వాడుకోవడం సిగ్గు చేటని కేసీఆర్ పై విజయశాంతి ఫైర్
గజం భూమి కబ్జా చేసినా కఠిన చర్యలు... ఎదురు తిరిగితే పీడీ యాక్ట్
మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన అవంతి శ్రీనివాస్ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన కబ్జాలు, దోపిడీ భీమిలి నియోజకవర్గంలో ప్రతి చెట్టు, పుట్ట చెబుతున్నాయని మంత్రి శ్రీనివాస్ చెప్పారు.గజం భూమి కబ్జా చేసినా కఠిన చర్యలు ఉంటాయని, ఎవరైనా ఎదురుతిరిగితే పీడీ యాక్ట్ పెడతామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాపు నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదో టీడీపీ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖ భూ కుంభకోణంపై గంటా లేఖ .. విచారణ జరిపిస్తామన్న మంత్రి అవంతి
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు వైయస్ జగన్ పైన ఎలాంటి విమర్శలు చేయని గంటా శ్రీనివాసరావు తాజాగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అవంతి శ్రీనివాస్ కు మాత్రం విశాఖ భూ కుంభకోణంపై గంటా లేఖ ఆయుధంగా మారింది. అందుకే విశాఖ భూ కబ్జాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని, అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుంటామని, ఈ కుంభకోణంలో భూ కబ్జాలకు పాల్పడిన నేతలు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో గంటా పేరు విశాఖ భూ కుంభకోణంలో పెద్ద ఎత్తున వినిపించిన నేపథ్యంలో తాజాగా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.