జైలుకెళ్ళొచ్చినా బుద్ధి రాలేదా .. జగన్ పై వ్యాఖ్యలా ? అచ్చెన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకో : మంత్రి అవంతి వార్నింగ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతోంది. విశాఖ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పలు సూచనలు చేయడంతో పాటుగా , విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కర్త, కర్మ, క్రియ అన్నీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు.
పోస్కో బృందంతో కలిస్తే లాలూచీ పడినట్టా ?
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని, ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలనే నిర్ణయం మార్చుకోవాలని లేఖ కూడా రాశారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పై టిడిపి నేతలు, టిడిపి అధినేత చంద్రబాబు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోస్కో బృందంతో కలిసినంతమాత్రాన లాలూచీ పడినట్లు కాదని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
అచ్చెన్నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జగన్ పై మాట్లాడాలని హెచ్చరిక
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని తేల్చి చెప్పిన మంత్రి అవంతి శ్రీనివాస్ అచ్చెన్నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు.
2014లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు హయాంలో చర్చలు జరగలేదా? 2018 లో కూడా పోస్కో ప్రతినిధులు చంద్రబాబును కలవ లేదా ? చంద్రబాబుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి అస్సలు తెలియదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు.
స్టీల్ ప్లాంట్ కోసం 20వ తేదీన మహాపాదయాత్ర చేస్తున్నామన్న మంత్రి అవంతి
స్టీల్ ప్లాంట్ పై తమ పార్టీ విధానం స్పష్టంగా ఉందని పేర్కొన్న మంత్రి అవంతి శ్రీనివాస్ కనీసం ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కేంద్రానికి, ప్రధానికి లేఖ రాసే ధైర్యం కూడా చేయలేదని విమర్శించారు.
రెండుసార్లు జైలుకెళ్లొచ్చినా అచ్చెన్నాయుడికి ఇంకా బుద్ధి రాలేదంటూ మండిపడిన మంత్రి, స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈనెల 20వ తేదీన స్టీల్ ప్లాంట్ కోసం మహా పాదయాత్ర చేస్తున్నామని పేర్కొన్న మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.