వెంట తీసుకెళ్లిన తల్లే ప్రాణం తీసింది?: అదృశ్యమైన విశాఖ చిన్నారి కొండపై విగతజీవిగా..
విశాఖపట్నం: వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి కేసు విషాదంతమైంది. చినముషిడివాడలోని కాటమయ్యకొండపై చిన్నారి జ్ఞానస మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. ఆ చిన్నారి మృతికి ఆమె తల్లే కారణం కావడం విచారకరం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రెండేళ్ల కూతుర్ని తీసుకుని వెళ్లి తల్లి...
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం పులిగాలిపాలేనికి చెందిన కుసుమలత ఫిబ్రవరి 6వ తేదీన తన భర్తతో బంగారం విషయంలో గొడవపడింది. అనంతరం రెండేళ్ల చిన్నకూతురును తనవెంట తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది.
చిన్నారి ఆకలితో చనిపోయిందని..
తల్లీకూతుళ్లు తిరిగిరాకపోవడంతో కుసుమలత భర్త, కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. చినముషిడివాడ కొండలపై కుసుమలత ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి జ్ఞానస ఎక్కడ? అని ప్రశ్నించగా.. మొదట పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఆ తర్వాత చిన్నారి ఆకలితో చనిపోయిందని చెప్పింది.
విగతజీవిగా జ్ఞానస.. కుసుమలతకు భోజనం పెట్టిన పశువుల కాపరి
ఈ నేపథ్యంలో చిన్నారి కోసం కొండపై పోలీసులు విస్తృతంగా గాలించారు. చివరకు బుధవారం ఉదయం చిన్నారి జ్ఞానస మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి అదృశ్యం కేసు విషాదాంతం కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, కొండపై పశువుల కాపరికి కుసుమలత ఒంటరిగా నీరసంగా కనిపించడంతో అతను తన ఇంటికి తీసుకెళ్లి ఆమెకు భోజనం పెట్టాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, చిన్నారి పాలు లేక ఆకలితో చనిపోయిందని.. కొండపై మృతదేహాన్ని పాతిపెట్టినట్లు చెప్పింది. దీంతో పోలీసులు బుధవారం చిన్నారి ఆచూకీని కనుగొన్నారు.
ఆ విషయం గూగుల్లో సెర్చ్ చేసిన కుసుమలత..
కుసుమలత తన కుమార్తెతో చనిపోవాలని నిర్ణయించుకున్నాకే ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకి వెళ్లే సమయంలో తన వయస్సు గల మహిళలు నీరు, ఆహారం లేకుండా ఎన్ని రోజులు జీవించగలరనే విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, చిన్నారి ఆకలి తాళలేక చనిపోగా.. కుసుమలత మాత్రం పశువుల కాపరి భోజనం పెట్టడంతో బతికి బట్టగట్టినట్లు తెలుస్తోంది.