'విశాఖ ఉక్కు'ను కాపాడుకోలేకపోతే చరిత్రహీనులమే-పదవులు కాదు ప్రజలు ముఖ్యం... : గంటా శ్రీనివాసరావు
విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం పరిశ్రమ కాదని.. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు అని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్ను నష్టాల సాకుతో ప్రైవేటీకరించాలనుకోవడం ఏపీ ప్రజలు జీర్ణించుకోలేని అంశమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం... ఒక మనిషి శరీరం నుంచి తలను వేరు చేయడం లాంటిదేనని వ్యాఖ్యానించారు. 1980లో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో స్టూడెంట్గా అడుగుపెట్టిన తాను... ఈరోజు ఇదే విశాఖలో ఇంత స్థాయికి చేరుకున్నానని గుర్తుచేసుకున్నారు. కాబట్టి విశాఖ వాసిగా విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పోరాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
నేనొక అడుగు ముందుకేశాను.. : గంటా
'నా రాజీనామా నిర్ణయం తెలిసినప్పటి నుంచి కార్మిక సంఘాలు,వివిధ రాజకీయ పార్టీల నేతలు,ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి పోరాడితేనే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది. నేను ఒక అడుగు ముందుకేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. వేల కి.మీ దూరమైనా ఒక అడుగుతోనే మొదలవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.' అని గంటా పేర్కొన్నారు.
ప్రజా ఉద్యమంలా మలుస్తాం....
' నా రాజీనామా నిర్ణయాన్ని నూటికి నూరు శాతం స్వాగతిస్తున్నామని ఎంతోమంది చెప్తున్నారు.ఇప్పటికే విశాఖ ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా ఫోన్లో మాట్లాడారు.ఎలా దీన్ని ఒక ప్రజా ఉద్యమంలా మలచాలని చర్చిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి అందరం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.త్వరలోనే కార్యాచరణపై చర్చిస్తాం.నేను ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం కూడా విశాఖ కర్మాగారాన్ని ప్రైవేకటిరించాలని నిర్ణయం తీసుకుంది. ఆనాటి ప్రధాని వాజ్పేయిని కలిసి ఆయనకు పరిస్థితులను వివరించాక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.' అని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
గనులు ఎందుకు కేటాయించరు...
నష్టాల పేరు చెప్పి పరిశ్రమను ప్రైవేటీకరించాలనుకోవడం సరికాదని గంటా పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఎంతోమంది కార్పోరేట్లకు గనులను కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం... విశాఖ ఉక్కు కర్మాగారానికి మాత్రం ఎందుకు కేటాయించకూడదని ప్రశ్నించారు. ఇప్పటికే విభజన హామీల్లోని రైల్వే జోన్,ప్రత్యేక హోదా... ఇలా ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని గుర్తుచేశారు. ఇలాంటి తరుణంలో విశాఖ స్టీల్ ప్లాంటును కూడా పరిరక్షించుకోలేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామన్నారు.
జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలి...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ప్రజా ప్రతినిధులు పదవుల కంటే ప్రజల మనోభావాలకు ప్రాధాన్యతనివ్వాలని గంటా సూచించారు. విశాఖలోని 15 మంది ఎమ్మెల్యేలు,,ఐదుగురు ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.
నీతి ఆయోగ్ సిఫారసు చేసిన ప్రతీదాన్ని అమలుచేయాలన్న నిబంధన ఏమీ లేదని.. కేంద్రం అనుకుంటే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చునని తెలిపారు. తన రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్లో లేదనడంపై స్పందిస్తూ... లేకపోతే మళ్లీ ఆ ఫార్మాట్లో పంపిస్తానని అన్నారు. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాబట్టి... క్షణాల్లో రాజీనామా లేఖపై సంతకం పెట్టి పంపించానన్నారు.