టీడీపీ మాజీమంత్రికి చెందిన కాలేజీ బస్సులు దగ్ధం: అనుమానాస్పదం..కుట్రకోణం
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల బస్సులు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో మూడు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ఒకేసారి మూడు బస్సులు మంటల బారిన పడటానికి గల కారణాలు తెలియరాలేదు. కుట్ర కోణం దాగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పలు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపించాలని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు.
విశాఖ ఉక్కు అమ్మకానికి: బడ్జెట్ ప్రతిపాదనల్లో: రేపట్నుంచే పార్లమెంట్: వైసీపీ వైఖరేంటీ?
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఈ తెల్లవారు జామున ఈ ఘటన సంభవించింది. నారాయణ విద్యాసంస్థలకు చెందిన బస్సులు పెందుర్తిలో పార్క్ చేస్తుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని పూర్తిస్థాయిలో వినియోగించట్లేదు యాజమాన్యం. విద్యార్థుల సంఖ్యను బట్టి ఆ బస్సులను బయటికి తీస్తున్నారు. కొంతకాలంగా అవన్నీ పెందుర్తిలోని ఖాళీ ప్రదేశంలోనే ఉంచారు. పార్క్ చేసి ఉంచిన బస్సుల్లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. పక్కపక్కనే ఉన్న మూడు బస్సులు దగ్ధం అయ్యాయి.
బస్సులు తగులబడుతుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పివేశారు. మిగిలిన బస్సులకు వ్యాపించకుండా నియంత్రించగలిగారు. పార్కింగ్ ప్రదేశం నుంచి మిగిలిన బస్సులను తొలగించారు. ఈ ఘటన పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. రాజకీయయ కక్షసాధింపు చర్యగా తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.