విశాఖ తీరంలో రష్యన్ అమ్మోనియం నైట్రేట్ నౌక- 25 వేల టన్నుల లోడ్ - బీరుట్ ఘటనతో నేవీ అప్రమత్తం..
లెబనాన్ రాజధాని బీరుట్లో తాజాగా జరిగిన అమ్మోనియం నైట్రేట్ పేలుళ్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అమ్మోనియం నైట్రేట్ రవాణా చేయాలన్నా, నిల్వ చేయాలన్నా ప్రభుత్వాలు బెంబేలెత్తే పరిస్ధితి. ఈ నేపథ్యంలో తాజాగా మన దేశంలో అమ్మోనియం నైట్రేట్ దిగుమతికి అనుమతి ఉన్న ఏకైక పోర్టు విశాఖకు ఓ రష్యన్ నౌక 25 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ను మోసుకుని వచ్చింది.
ప్రస్తుతం అమ్మోనియం నైట్రేట్ నిల్వ చేసే విషయంలో ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా భయపడుతున్న పరిస్ధితుల్లో విశాఖ పోర్టు అధికారులు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే విశాఖ పోర్టులో ఉన్న గోదాముల్లో కొన్ని రసాయన నిల్వలు ఉన్నాయి. బీరుట్ ప్రమాదం నేపథ్యంలో వీటిని తనిఖీ చేసిన అధికారులు.. తాజాగా రష్యన్ నౌకలో మరోసారి అమ్మోనియం నైట్రేట్ వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచారు. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎలాంటి సంబంధం లేకపోవడంతో నేవీ అధికారులే పోర్టు అధికారుల సాయంతో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
Recommended Video
ఇప్పటికే విశాఖ పోర్టులో ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలను వాటి గమ్యస్ధానాలకు చేర్చే ప్రయత్నంలో ఉన్న పోర్టు అధికారులు.. తాజాగా వచ్చిన రష్యన్ నౌక నుంచి ఈ రసాయన దిగుమతి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీన్ని కూడా సాధ్యమైనంత త్వరగా వివిధ పరిశ్రమలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.