ఉపాధి కోసం ఆఫ్రికా వెళ్లి..ఎబోలాతో సహవాసం చేస్తోన్న ఉత్తరాంధ్ర యువత
విశాఖపట్నం: ఉపాధి కోసం ఆఫ్రికా ఖండంలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ కాంగో (డీఆర్సీ) దేశానికి వెళ్లిన ఉత్తరాంధ్ర యువకులు అక్కడ ప్రత్యక్ష నరకాన్ని చవి చూస్తున్నారు. అత్యంత ప్రమాదరమైన ఎబోలా వైరస్ తో సహజీవనం సాగిస్తున్నారు. ప్రాణాంతక ఎబోలా వైరస్ వ్యాపిస్తోందని, తమను స్వదేశానికి పంపించేయాలని ఆ యువకులు మొర పెట్టుకుంటున్నప్పటికీ.. వారు పనిచేస్తోన్న సంస్థ యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. చెప్పా పెట్టకుండా వెళ్లిపోతారనే కారణంతో ఆ సంస్థ ప్రతినిధులు వారి పాస్ పోర్టులను సైతం లాక్కున్నారు. ఎబోలా వైరస్ వ్యాప్తి చెందకుండా కనీసం జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం వల్ల కార్మికుల్లో తీవ్ర భయాందోళనలను వ్యక్తమౌతున్నాయి. ఈ వైరస్ సోకితే.. చావు తప్పదనే బాధ వారిలో నెలకొంది. తాము ఇన్నాళ్లూ దాచుకున్న సొమ్ము అంతా చికిత్సకే సరిపోతుందని, అయినప్పటికీ.. ప్రాణాలు నిలుస్తాయనే గ్యారంటీ లేదని ఆ యువకులు వాపోతున్నారు.
అన్న క్యాంటీన్ల చుట్టూ రాజకీయాలు: సొంత ఖర్చుతో అన్నం పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే!
కుటుంబ సభ్యులకు వీడియో..
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు యువకులు ఓ ఏజెన్సీ ద్వారా ఎనిమిది నెలల కిందట కాంగో వెళ్లారు. మనదేశ కరెన్సీతో పోల్చుకుంటే ప్రతినెలా లక్ష రూపాయల జీతం దొరుకుతుందని ఆ ఏజెన్సీ నిర్వాహకులు ఆశ చూపెట్టారు. మూడు పూటలా భోజనంతో పాటు ఉచితంగా నివాస వసతిని కల్పిస్తారని ప్రలోభానికి గురి చేశారు. వారి మాయమాటలను నమ్మి మన దేశానికి చెందిన వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారుగా 50 మంది వరకు అక్కడ ఉన్నారు. వారిలో సగం మంది ఉత్తరాంధ్రకు చెందిన యువకులే ఉన్నారు. వారంతా దిగవ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారే. ఇదివరకు దుబాయ్, బహ్రెయిన్, షార్జా, కువైట్ వంటి దేశాల్లో పనిచేసిన అనుభవం కూడా కొందరికి ఉంది. దీనితో అధిక జీతం వస్తుందనే ఉద్దేశంతో ఆఫ్రికా ఖండంలోని కాంగోకు వెళ్లారు.
చైనా సంస్థలో వెల్డర్లుగా వెళ్లి..కూలీలుగా మారి
చైనాకు చెందిన ఒక సంస్థలో వారికి ఉపాధి దొరికింది. చాలామంది వెల్డర్లుగా పనిచేస్తున్నారు. అక్కడికి వెళ్లిన తరువాత అసలు విషయం వారికి అర్థమైంది. వెల్డింగ్ కు బదులుగా కూలీపని చేయించడం ఆరంభించారని, ముందుగా చెప్పినంత వేతనం ఇవ్వట్లదేని బాధిత యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పడుతున్న బాధలను వివరిస్తూ కుటుంబ సభ్యులకు ఓ వీడియోను పంపించారు. శ్రీకాకుళం జిల్లా నౌపాడకు చెందిన సీతారం, దామోదర్, అదే జిల్లా పలాస, సోంపేటలకు చెందిన రమేష్, రమణ, విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్ఞానేశ్వరరావు, కె.జోగారావు ఈ వీడియోను పంపించారు.
జీతం అడిగితే.. జైలుపాలు చేస్తామంటున్నారు..
కడుపు నిండా భోజనం సైతం పెట్టట్లేదని, రొట్టె ముక్కలను ఇచ్చి సంస్థ యాజమాన్యం చేతులు దులుపుకొంటోందని వాపోతున్నారు. తమకు ముందుగా చెప్పినంత వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. చితక్కొడుతున్నారని, చోరీ కేసులు నమోదు చేయించి, జైలు పాలు చేయిస్తామని సంస్థ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారని చెప్పారు. కాంగో వెళ్లడానికి తాము లక్షన్నర రూపాయల వరుక ఏజెన్సీకి సమర్పించుకున్నామని, ఇక్కడికి వచ్చిన తరువాత వారి జాడే తెలియరావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు బాధిత యువకులు. తాము ఉద్యోగంలో చేరిన తొలి రెండు నెలలు జీతాలు ఇవ్వలేదని, ఫలితంగా తాము వెంట తెచ్చుకున్న డబ్బులు పూర్తిగా అయిపోయాని అంటున్నారు. ప్రస్తుతం తాము పనిచేస్తోన్న ప్రాంతానికి సమీపంలోని ఓ పట్టణంలో ఎబోలా వ్యాపించిందని, దీన్ని దృష్టిలోపెట్టుకుని అయినా తమను విడిచి పెట్టాలని అభ్యర్థించగా.. సంస్థ యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకెలాంటి భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు.