మున్సిపల్ ఎన్నికల వేళ: విశాఖకు రూ.7.9 కోట్ల దొంగనోట్లు: ఎందుకు?..ఎవరికోసం?
విశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ప్రచార తీవ్రత పెరుగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ-జనసేన కూటమి నేతలు వార్డు వార్డుకు, ఇంటింటికీ తిరుగుతోన్నారు. విస్తృత ప్రచారాన్నిసాగిస్తోన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారం అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది. పరిపాలన రాజధాని, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం.. వంటి పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ విశాఖ ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠతను రేపుతోంది.
Recommended Video
రూ.7.9 కోట్ల విలువ చేసే దొంగనోట్లు..
ఈ పరిణామాల మధ్య- దొంగ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 7.9 కోట్ల రూపాయల విలువ చేసే దొంగనోట్లు అవి. 500 రూపాయల నోట్లు అవన్నీ. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ నుంచి విశాఖపట్నానికి తరలిస్తోండగా.. పోలీసులు పట్టుకున్నారు. దొంగనోట్ల రవాణాలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ.. సాగర నగరానికి ఇంత పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీిని ఎందుకు తరలించాల్సి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది.
ఛత్తీస్గఢ్ రిజిస్ట్రేషన్ వాహనంలో..
రాయ్పూర్ నుంచి విశాఖపట్నానికి రావాలంటే ఒడిశా మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. గంజాయి రవాణా అధికంగా సాగుతోన్నందున ఒడిశా పోలీసులు ఏజెన్సీ మీదుగా సాగే అన్ని మార్గాలపైనా నిఘా వేశారు. ఈ క్రమంలో ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పొత్తంగి పోలీస్ స్టేషన్ పరిధిలో.. విశాఖపట్నం వైపు వస్తోన్న ఫోర్డ్ ఫిగో కారును పోలీసులు తనిఖీ చేశారు. ఛత్తీస్గఢ్ రిజిస్ట్రేషన్ నంబర్తో ఉన్న కారు అది. తనిఖీ సందర్భంగా మూడు బ్యాగుల్లో దాచి ఉంచిన నకిలీ నోట్లు వెలుగులోకి వచ్చాయి. 500 రూపాయల నోట్ల కట్టలను నింపి ఉన్న బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఎలాంటి రశీదులు లభించకపోవడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
1,580 నోట్ల కట్టలు..
ఆ బ్యాగుల్లో మొత్తం 1,580 నోట్ల కట్టలు ఉన్నాయని, అవన్నీ నకిలీవేనని కోరాపుట్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వరుణ్ గుంటుపల్లి తెలిపారు. 500 రూపాయలకు చెందిన నోట్లు.. ఒక్కో కట్టలో వంద ఉన్నాయని వివరించారు. వాటిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దొొంగనోట్ట కట్టలను తరలించడానికి వినియోగించిన కారును సీజ్ చేశామని, ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ ముగ్గురూ ఛత్తీస్గఢ్కు చెందినవారేనని చెప్పారు. వారిపై ఐపీసీ సెక్షన్లోని యూ/ఎస్ 489 ఏ/489 బీ/489 సీ/120 బీ కింద కేసులు నమోదు చేశామని అన్నారు. వాటిని ఎందుకు? ఎవరి కోసం తీసుకెళ్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నామని వరుణ గుంటుపల్లి చెప్పారు.