రెండు వారాలు చూస్తాం..టెంట్లు వేస్తాం: అవంతి..కన్నబాబు అలా ఉండేవారు: సీఎస్ పై వేటు దేనికి: పవన్ ఫైర్
తాను ఇసుక సమస్య..భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందుల గురించి మాట్లాడితే వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ ప్రభుత్వం సమస్య లేకుండా పాలన చేస్తే తాము ఎందుకు రోడ్డు మీదకు వస్తామని ప్రశ్నించారు. వాళ్లకు ప్రజలు 151 సీట్లు ఇచ్చారని..తమకు ఒక్క సీటు మాత్రమే ఇచ్చినా..ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా తమ పార్టీ స్పందిస్తుందని స్పష్టం చేసారు.
వైసీపీ నేతలు అంటే తనకు వ్యక్తిగతంగా ద్వేషం లేదని..అదే సమయంలో రెండు వారాల్లోగా భవన నిర్మాణ కార్మికుల సమస్య పరిష్కరించకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేసారు. టెంట్లు వేసి కూర్చోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కన్నబాబుకు తమ పట్ల కృతజ్ఞత ఉండాలన్నారు. అవంతి శ్రీనివాస్ ప్రజారాజ్యంలో తన వెంట ఎలా తిరిగే వారో తెలుసా అంటూ ఆయన గురించి పవన్ వివరించారు. పాలనలో తప్పులు ఉంటే ఖచ్చితంగా నిలదీస్తామని పవన్ స్పష్టం చేసారు.
పరిష్కరించకుంటే కార్యాచరణ ప్రకటిస్తాను..
అన్ని రాష్ట్రాల్లో వరదలు ఉన్నా..ఏపీలో మాత్రమే ఇసుక కొరత ఎందుకు వచ్చిందని జనసేన అధినేత పవన్ ప్రశ్నించారు. సమస్య ఉండటంతోనే మూడు కిలో మీటర్ల మేర జనం వచ్చారన్నారు. తనకు వైసీపీ నేతల మీద వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ తప్పులు..అక్రమాలు ఉంటే వాటిని సరి చేయండి కానీ, మొత్తం నిర్మాణాలనే ఆపివేయటం సరి కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ సమస్య వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భవన నిర్మాణ రంగం మీద దాదాపు కోటి మంది ఆధారపడి ఉన్నారని..వారిని ఆదుకోవాలని డిమాండ్ చేసారు.
అయిదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా
తనను వ్యక్తిగతంగా తిట్టినంత మాత్రాన సమస్యలు పరి ష్కారం కావని సూచించారు. రెండు వారాల్లోగా తాను డిమాండ్ చేసిన విధంగా భవన నిర్మాణ కార్మికులకు పరిహారం..అదే విధంగా ఆత్మహత్య చేసుకున్న వారికి అయిదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు. లేకుంటే..ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటిస్తానని..పార్టీ శ్రేణులు సైతం టెంట్లు వేసి కూర్చోవాలని పిలుపునిచ్చారు.
సీఎస్ ను ఎందుకు బదిలీ చేసారు..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రమణ్యం ను ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం..ఇప్పుడు సడన్ గా ఎందుకు బదిలీ చేసిందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సీఎస్ ను బదిలీ చేసిందంటే ఖచ్చితంగా పాలనలో అవకతవకలు జరుగుతున్నట్లేనని వ్యాఖ్యానించారు. పాలనలో లోపాలు ఉండబట్టే సీఎస్ ను బదిలీ చేసారని చెప్పుకొచ్చారు. కన్నబాబుకు తమ సోదరులు రాజకీయంగా జీవితం ఇచ్చారని అటువంటి వ్యక్తి వారి మీద కృతజ్ఞత తో వ్యవహరించాలన్నారు. అదే విధంగా అవంతి శ్రీనివాస్ ప్రజారాజ్యంలో తన వెంట ఎలా తిరిగేవారో అప్పుడు పార్టీలో ఉన్న వారందరికీ తెలుసన్నారు.
సౌమ్యంగా ఉండే అవంతి
బొట్టు పెట్టుకొని సౌమ్యంగా ఉండే అవంతి ఈ రోజు తన మీద విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనను విమర్శిస్తే తాను పట్టించుకోనని..భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం వదిలేది లేదని స్పష్టం చేసారు. ఇప్పటికే సమస్య పరిష్కారానికి ప్రభుత్వంలో మేధావులు ఉన్నారని వారి సూచనలు తీసుకోవాలని..తమ పార్టీలోని వారి సూచనలు..సలహాలు సైతం అందించటానికి సిద్దంగా ఉన్నామని పవన్ చెప్పారు.