పవన్ కళ్యాణ్ సభలో కలకలం: కరెంట్ షాక్ తో గాయాలు: ఆస్పత్రికి తరలింపు..!
విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ సభా వేదిక వద్ద కలకలం చోటు చేసుకుంది. పవన్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల పైన ఒక్కసారిగా దూసుకురావటంతో కరెంట్ షాక్ కొట్టింది. అనేక మంది గాయ పడ్డారని భావించినా..ఇద్దరికి మాత్రమే గాయాలు అయినట్లు గుర్తించారు.
ఆ సమయంలో ప్రసంగిస్తున్న టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు అందరూ వెంటనే వెనక్కు వెళ్లిపోవాలని సూచించారు. ఆ వెంటనే జనరేటర్ నుండి విద్యుత్ సరఫరా నిలిపివేసారు.
సభా నిర్వహకులు వెంటనే అంబులెన్స్ లను పిలిపించారు. గాయపడిన వారిని అందులో ఆస్పత్రికి తరలించారు. పెద్ద ఎత్తున జనం తోసుకు రావటంతో వాలంటీర్లకు వారిని నియంత్రించటం కష్టంగా మారింది. పవన్ కళ్యాణ్ వేదిక మీదకు రాగానే ఆయన్ను చూసేందుకు వీరంతా ఒక్క సారిగా వేదిక ముందుకు వచ్చారు. దీంతో.. అక్కడ స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది.
అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వెంటనే పవన కళ్యాణ్ ..నాగబాబు స్పందించారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేసారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సభా వేదిక మీద కార్యక్రమాలను నిలిపివేసారు. బాధితులు చికిత్స పొందుతున్నారు.