ఏపీలో ఏజన్సీ ప్రాంతాలకు దుస్థితి.. నిండు గర్భిణీని 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన వైనం..!
విశాఖపట్నం : రవాణా సౌకర్యం సరిగా లేక.. దారులు సైతం బురద గుంటలుగా మారిన వేళ.. ఓ నిండు గర్భిణీ అవస్థల పాలైన ఘటన విశాఖపట్నం జిల్లాలో వెలుగుచూసింది. ఆసుపత్రికి వెళ్లాలంటే మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడిన ఘటన బయటకు రావడంతో తీవ్రస్థాయిలో చర్చానీయాంశమైంది. ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్గా మారింది.
నిండు గర్భిణీ ప్రసవం కోసం అష్టకష్టాలు పడ్డారు. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో కుటుంబ సభ్యుల వెతలు అన్నీ ఇన్నీ కావు. సరైన రోడ్లు లేక, గుంతలు పడ్డ రోడ్ల మీదనే నడుస్తూ దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్లిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారింది. వర్షపు నీటితో బురద గుంటలుగా మారిన రోడ్ల మీద నడుస్తూ నరకయాతన అనుభవించారు ఆ కుటుంబ సభ్యులు. నిండు గర్భిణీని జాగ్రత్తగా మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బామ్మగారు.. ఆ పాటలేంది.. ఆ ఆటలేంది..!
విశాఖ జిల్లా వి.మాడుగుల మండలంలో ఆదివారం నాడు జరిగిన ఈ ఘటన మీడియా ద్వారా వెలుగుచూసింది. కొత్తవలస గ్రామానికి చెందిన దేవి అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు ఫ్యామిలీ మెంబర్స్. ఆ క్రమంలో తమ గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దాంతో ఏమీ చేయాలో తెలియక కొన్ని చీరలతో డోలీగా మలిచి అందులో మోస్తూ తీసుకెళ్లారు. అలా దాదాపు 5 కిలోమీటర్ల దూరంలోని శంకరం గ్రామపంచాయితీకి చేరుకున్నారు. అయితే అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న 108 అంబులెన్స్లో కేజేపురం ప్రైమరీ హెల్త్ సెంటర్కు తరలించారు. అనంతరం డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించి ప్రసవానికి ఏర్పాట్లు చేయడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు దేవి.
తల్లీబిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే విషయం కాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో కలెక్టర్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు మండల అభివృద్ధి అధికారి వెంటనే ఆ ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అదలావుంటే కొత్తవలస గ్రామానికి పక్కా రహదారి నిర్మాణం జరిగేలా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఈ బిడ్డ పుట్టిన వేళ.. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం రానుందన్నమాట.