విశాఖలో రేవ్ పార్టీ కల్చర్ .. బీచ్ రిసార్ట్స్ లో భారీగా డ్రగ్స్ కలకలం
విశాఖలో డ్రగ్స్ సంస్కృతి జడలు విప్పుతోంది. ఒకప్పుడు చాలా డీసెంట్ సిటీగా ఉన్న విశాఖ అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మారుతుంది . ఒకప్పుడు హైదరాబాద్, ముంబై వంటి నగరాలకే పరిమితమైన కల్చర్ ఇప్పుడు సాగర తీరాన కూడా ప్రబలుతోంది .వీకెండ్ పార్టీల పేరుతో యువత ప్రమాదకరమైన డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు. . బొంబాయి, హైదరాబాద్లాంటి నగరాలకు పరిమితం అయిన రేవ్ పార్టీ కల్చర్ కూడా ఇప్పుడు విశాఖ తీరాన్ని తాకింది. తాజాగా రుషికొండ సమీపంలోని బీచ్ ఫ్రంట్ రిసార్ట్లో నిర్వహించిన ఒక రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది.
అప్పుడే మొదలైందా ..!? ఆ టీవీ చానల్లకు తన పవరేంటో చూపిస్తానంటూన్న వైసీపీ నేత పీవీపీ !
విశాఖలో రేవ్ పార్టీ కల్చర్... మాదక ద్రవ్యాలతో మత్తులో చిత్తవుతున్న యువత
రేవ్ పార్టీ కల్చర్ ... విశాఖ వాసులు దిగుమతి చేసుకుంటున్న కొత్త సంస్కృతి. విశాఖలోని కొందరు నిర్వాహకులు నిషేధిత మత్తు పదార్థాలతో రేవ్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు . ఎండీఎంఏ, ఎల్ఎస్డీలాంటి మత్తుపదార్థాలను నిర్వాహకులు యూత్కు అలవాటు చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న రేవ్ పార్టీ ఘటనలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రుషికొండలోని ఓ రిసార్ట్ లో రేవ్ పార్టీ ... డ్రగ్స్ వినియోగం
విశాఖ నగరానికి చెందిన సోను అనే వ్యక్తి రుషికొండలోని ఓ రిసార్ట్ను ఒకరోజు అద్దెకు తీసుకుని శనివారం అక్కడ సుమారు 50మంది యువకులు, పదిమంది యువతులతో పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో మద్యం తాగటానికి వీలుగా ఎక్సైజ్శాఖ నుంచి అనుమతి తీసుకున్నాడు. అయితే పార్టీలో మద్యంతోపాటు గోవా నుంచి తీసుకువచ్చిన ఎల్ఎస్డీ స్టిక్కర్లు, ఎండీఎంఏ పౌడరులాంటి అత్యంత మత్తు కలిగించే మాదక ద్రవ్యాలను అందుబాటులో ఉంచారు. అంతే కాక అనుమతి పొందిన సమయం దాటి విపరీతంగా డీజే సౌండ్స్తో పార్టీ నిర్వహించారు.
విశ్వనాథ్ బీచ్ఫ్రంట్ రిసార్ట్స్ లోనూ రేవ్ పార్టీల కల్చర్
కాశీనరేంద్ర అనే మరో వ్యక్తి విశ్వనాథ్ బీచ్ఫ్రంట్ రిసార్ట్స్ నిర్వహిస్తున్నాడు. వీకెండ్ లో మద్యం విక్రయాలకు ఎక్సైజ్శాఖ నుంచి అనుమతి పొందాడు. అయితే శనివారం అర్థరాత్రి 12 గంటల సమయంలోనూ ఫుల్ డీజే సౌండ్స్తో పార్టీ నిర్వహించటంపై కొందరు ఫిర్యాదు చేయడంతో టాస్క్ఫోర్స్ బృందం అక్కడికి వెళ్లి సైలెంట్ గా వెనక్కి వచ్చారు. ఓ మంత్రి అనుచరుడి వల్లే పోలీసులు సైలెంట్ అయ్యారని సమయం దాటాక పార్టీలు నిర్వహిస్తే ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి .
మండిపడుతున్న మహిళా సంఘాలు .. డ్రగ్స్ వినియోగం పై ఒకరు అరెస్ట్
రేవ్ పార్టీల కల్చర్ పెరగటమే కాకుండా అందులో డ్రగ్స్ కూడా వినియోగిస్తున్నారని గుర్తించిన పోలీసులు ఆ పార్టీలో పాల్గొన్న మనకొండ సత్యనారాయణ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గరి నుంచి ఒక గ్రామ ఎండీఎంఏ మత్తు పదార్థంతోపాటు ఎల్ఎస్డీ స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రేవ్ పార్టీలో నిషేధిత మత్తు పదార్థాలను వినియోగించినట్టు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి పార్టీ నిర్వాహకులు సాయి రాఘవ్చౌదరి, సోను అనే యువకుడితోపాటు మరికొందరిని ఆరా తీశారు. సత్యనారాయణ తానే గోవా నుంచి మత్తు పదార్థాలను తీసుకొచ్చినట్టు అంగీకరించినట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ నుండి రేవ్ పార్టీల కల్చర్ నుండి యువతను కాపాడాలని కోరుతున్న నగరవాసులు
గతంలో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ హాస్టల్స్లో మత్తుపదార్థాల వినియోగంపై పెద్ద దుమారమే లేచింది . విశాఖ నగరంలో యువత డ్రగ్స్ కు బానిసలు గా మారుతున్నారన్నది నమ్మలేని నిజం . రేవ్ పార్టీలను , డ్రగ్స్ సంస్కృతిని అరికట్టకుంటే విశాఖ యువత మత్తు పదార్ధాలకు బానిసలుగా మారతారని నగర వాసులు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు , అధికారులు దీనిపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు .