Vizag: అందరి కళ్లూ విశాఖ వైపే: అప్పుడే మొదలెట్టేశారు: హాట్ కేకుల్లా.. !
విశాఖపట్నం: విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చబోతున్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అనంతరం ప్రస్తుతం అందరి కళ్లూ ఆ తీర ప్రాంత నగరం మీదే నిలిచాయి.. ప్రతిపక్ష పార్టీల నాయకులతో సహా. అమరావతిలో రైతుల ఆందోళనలు, తెలుగుదేశం పార్టీ నిరసన ప్రదర్శనలు ఒకవంక కొనసాగుతుండగానే.. విశాఖను రాజధానిగా మార్చే ప్రక్రియ వేగవంతమైంది. చకచకా సాగిపోతోంది.
రియల్టర్ల నయా వెంచర్ క్యాపిటల్
విశాఖపట్నం.. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల నయా వెంచర్ సిటీగా మారింది. ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు రియల్టర్లు విశాఖలో పాగా వేస్తున్నారు. సంక్రాంతి తరువాత భూముల క్రయ, విక్రయాలు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగర శివార్లలో కొత్త వెంచర్లు వేయడానికి తీసుకోవాల్సిన అనుమతుల గురించి ఆరా తీస్తున్నారు. ఫలితంగా-గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కి సందర్శకుల తాకిడి పెరుగుతోంది.
హాట్ కేకుల్లా..
ప్రముఖ పర్యాటక కేంద్రం రామకృష్ణా బీచ్ నుంచి భీమిలీ వెళ్లే మార్గంలో భూములు హాట్ కేకుల్లా మారినట్లు తెలుస్తోంది. ఈ మార్గంలో ట్రామ్వే ట్రైన్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండటంతో.. సచివాలయం, ముఖ్యమంత్రి అధికారిక క్యాంపు కార్యాలయం రానుండటం వంటి పరిణామాల దృష్ట్యా భూముల రేట్లు చుక్కలనంటుతున్నాయి. మధురవాడ, సాగర్ నగర్, మిథిలాపురి వుడా కాలనీ, రుషికొండ ప్రాంతాల్లో భూముల రేట్లకు మంచి డిమాండ్ లభిస్తోంది.
రాజధాని దిశగా ఒక్కో అడుగు..
అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలను తీవ్ర స్థాయికి చేరినప్పటికీ.. వాటిని ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలేవీ కనిపించట్లేదు. పైగా- మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ, శాసనసభ సభ్యులు, పార్టీ నాయకులు కొత్తగా ప్రదర్శనలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో- విశాఖలో రాజధాని ఏర్పాటు ఖాయమనే అభిప్రాయాలు తెలుగుదేశం, జనసేన పార్టీ నేతల్లోనూ నెలకొంది. వారు కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.
భవనాల అన్వేషణలో ప్రవీణ్ ప్రకాష్.
ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్.. ఇప్పటికే పలు దఫాలుగా విశాఖపట్నాన్ని సందర్శించారు. మిలీనియం టవర్స్ను సచివాలయంగా మార్చుతారంటూ వార్తలు ఇదివరకే వెలువడ్డాయి. ఇక -పరిపాలనకు అనుగుణమైన భవనాల కోసం ఆయన జీవీఎంసీ అధికారులతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. ఫలితంగా- ఆయా చోట్ల ఇప్పటికే ఉన్న తమ నివాసాలను ఇతరులకు అద్దెకు ఇవ్వడానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు స్థానికులు.
వర్కింగ్ మెన్స్ హాస్టళ్లుగా..
సచివాలయం, దానికి అనుబంధ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతాయని భావిస్తోన్న ప్రాంతాల్లో వర్కింగ్ మెన్స్ హాస్టళ్లు వెలుస్తున్నాయి. తాము నివసిస్తోన్న ఇళ్లను వర్కింగ్ మెన్స్ హాస్టళ్లుగా మార్చడంపై దృష్టి పెట్టారు స్థానికులు. దీనికి అవసరమైన అనుమతుల కోసం జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు దరఖాస్తులు దాఖలు చేస్తున్నారు. కొద్దిరోజుల నుంచి ఈ తరహా ధరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగిందని టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు.