గంటా చేరికకు రూట్ క్లియర్.!9న కప్పుకోనున్న వైసీపి కండువా.!మారనున్న ఉత్తరాంధ్ర సమీకరణాలు.!
విశాఖపట్టణం/హైదరాబాద్: వరుస విషాద సంఘటనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న విశాఖ పట్టణం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కనుంది. విశాఖ సిటీలో ఎదురులేని నేతగా అన్ని వ్యవస్దలపైన ఆదిపత్యం ఉన్న గంటా శ్రీనివాస్ రావు అధికార వైసీపిలో చేరేందుకు మార్గం సుగమం అయినట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఎంతో కాలంగా కొనసాగుతున్న సస్పెన్సుకు ఆగస్టు 9వ తేదీన తెరపడబోతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. విశాఖ రాజకీయాల్లో తన రాజకీయ ప్రస్థానం గురించి ఇన్నిరోజులుగా వస్తున్న వదంతులకు చెక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన తర్వాత పార్టీని చాలా మంది నేతలు వీడతారనే పుకార్లు చెలరేగాయి. అందులో గంటా శ్రీనివాస్ రావు కూడా కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. గంటా టీడీపీ గూటి నుంచి అధికార పార్టీలోకి మారితే ఉత్తరాంధ్ర రాజకీయల్లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయనే చర్చ తారాస్థాయిలో జరుగుతోంది.
పరిపాలనా రాజధాని విశాఖకు తరలుతున్న క్రమంలో గంటా శ్రీనివాస్ రావు అధికారపార్టీలో చేరితే పార్టీకి ఎంతో ప్రయోజనకరమని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గంటా రాకను ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. మూడు రాజధానుల అంశంతోపాటు విశాఖలో వైసీపీ బలపడేందుకు గంటా ఆవశ్యకత ఎంతో అవసరమని భావిస్తున్న వైసీపీ అధిష్టానం ఆయన చేరికకు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని కొందరు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ధృవీకరిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 9వ తేదీన గంటా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం ఖాయమని వైసీపీ వర్గాలంటున్నాయి. ఇదిలా ఉండగా గంటా చేరిక అనివార్యం కావడంతో విశాఖ వైసీపీలో కీలకంగా ఉన్న పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి అవంతి శ్రీనివాస్, గంటా చేరికను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కాగా వీరిద్దరి మధ్య సమన్వయం కుదిర్చేందుకు సీఎం ఓ ఎంపీని రంగంలోకి దించినట్టు అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.