విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు: డెన్మార్క్ సంస్థ: బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా రుషికొండ బీచ్
విశాఖపట్నం: విశాఖపట్నం మరోసారి అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. ప్రతిష్ఠాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ లభించింది. విశాఖ రుషికొండ బీచ్ను అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని తీర ప్రాంత పర్యాటక కేంద్రాలకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ దక్కుతుంది. డెన్మార్క్లోని పర్యావరణ, అధ్యయన సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను అందజేస్తుంది. ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్కు ఎంపికైన బీచ్ల జాబితాను ఆ సంస్థ విడుదల చేసింది.
ఇందులో రుషికొండ బీచ్కు చోటు లభించింది. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అందుకున్న బీచ్లను అన్ని రకాలుగా అత్యంత సురక్షితమైనదిగా భావిస్తారు. కాలుష్యం లేకపోవడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యాటకులకు భద్రత కల్పించడం, తీర ప్రాంతంలో సముద్ర జలాల నాణ్యత, కాలుష్య రహితం, పర్యావరణ హితం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కోసం ఆయా తీర ప్రాంత పర్యాటక కేంద్రాలను ఎంపిక చేస్తారు.
బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉన్న తీర ప్రాంతాల్లో పర్యటించడానికి విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపుతారు. గత ఏడాది నోటిఫికేషన్ ప్రకారం..రుషికొండ బీచ్తో పాటు శివ్ రాజ్పూర్ (దేవభూమి ద్వారకా-గుజరాత్), భొగావె (సింధుదుర్గ్-మహారాష్ట్ర), ఘోఘ్లా (డయ్యు), మిరామర్ (పనాజి-గోవా), కసర్కోడ్ (కార్వార-కర్ణాటక), పడుబిద్రి (ఉడుపి-కర్ణాటక), కప్పడ్ (కోజికోడ్-కేరళ), ఈడెన్ (పుదుచ్చేరి), మహాబలిపురం (తమిళనాడు), గోల్డెన్ (పూరి-ఒడిశా), రాధానగర్ (పోర్ట్బ్లెయిర్-అండమాన్ నికోబార్) బీచ్లను ఈ సర్టిఫికేషన్ కోసం ఎంపిక చేశారు.
Recommended Video
షార్ట్ లిస్ట్లో ఏపీ నుంచి రుషికొండ బీచ్ మాత్రమే స్థానం పొందింది. ప్రపంచవ్యాప్తంగా 4,573 బీచ్లు, మెరీనా, బోటింగ్ ప్రాంతాలు ఇప్పటికే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను అందుకున్న జాబితాలో ఉన్నాయి. బ్లూఫాగ్ సర్టిఫికేట్ లభించడం వల్ల విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా- ఆ బీచ్కు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గుర్తింపు లభిస్తుంది. విదేశీ పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకట్టుకోవడానికి వీలు కలుగుతుంది. ఫలితంగా- పర్యాటక రంగం మరింత బలోపేతమైనట్టవుతుంది.