విశాఖలో యువతుల మిస్సింగ్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మాయం, పేరెంట్స్ ఆందోళన..
లోకం పోకడో లేదంటే సమాజంలో వస్తోన్న మార్పులో తెలియదు కానీ.. పెద్దలంటే యువతకు భయం లేకుండా పోయింది. పేరెంట్స్ అంటే భయం, భక్తి లేకపోగా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. విశాఖపట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు ఇంట్లోంచి వెళ్లిపోయారు. దీంతో ఏం జరిగిందా అని తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. కిడ్నాప్ చేశారా అని భావించే సరికి.. వారి మొబైల్ నుంచి మెసేజ్ వచ్చింది.
ఇక్కడున్నాం.. లేదంటే తమను ఎవరైనా కిడ్నాప్ చేశారని మెసేజ్లో లేదు. తాము చనిపోతున్నామని రాయడంతో విస్తుపోవడం తల్లితండ్రుల వంతయిపోయింది. వారు ఎందుకీలా చేస్తున్నారో అర్థం కాక పేరెంట్స్ తల పట్టుకున్నారు. వెంటనే ద్వారకానగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. యువతుల ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
Recommended Video
తమ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవని తల్లిదండ్రులు చెప్తున్నారు. వారిని తాము పల్లెత్తు మాట కూడా అనలేదని గుర్తుచేశారు. ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని.. సవ్యంగా సాగిపోతున్న కుటుంబంలో ఒక్కసారిగా మిస్సింగ్ కలకలం రేపిందన్నారు. తమ కూతుళ్లను త్వరగా ఇంటికి తీసుకొని రావాలని పోలీసులను వేడుకున్నారు. యువతి మొబైల్ లోకేషన్ ఆధారంగా గుర్తించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా వారిని తీసుకొస్తామని పోలీసు ఉన్నతాధికారులు తల్లిదండ్రులకు భరోసానిస్తున్నారు.