ఆదుకోని బీజేపీ- కలిసి రాని వైసీపీ- సింహాచలం వ్యవహారంలో ఏకాకిగా సంచయిత...
గతేడాది అనూహ్య పరిస్ధితుల మధ్య సింహాచలం ట్రస్టు ఛైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన సంచయిత గజపతిరాజు ప్రస్తుతం దేవస్ధానం రాజకీయాల్లో ఏకాకిగా మారినట్లు కనిపిస్తున్నారు. సొంత పార్టీ బీజేపీని కాదని వైసీపీ అండతో పదవి దక్కించుకున్న సంచయిత స్ధానిక రాజకీయాల్లో కలుపుగోలుగా వ్యవహరించకపోవడం సమస్యగా మారుతోంది. తాజాగా ఆలయంలో నెలకొన్న పరిస్ధితులపై మాజీ ఈవో భ్రమరాంబ వెళ్లిపోయే ముందు రాసిన లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. అయినా దీనిపై మాట్లాడేందుకు అటు బీజేపీ కానీ, ఇటు వైసీపీ నేతలు కానీ ముందుకు రావడం లేదు. సంచయితే ఏకపక్ష నిర్ణయాలే దీనికి కారణమన్న ప్రచారం సాగుతోంది.
సింహాచలం బోర్డు రాజకీయాలు..
రాజకీయంగా క్రియాశీలకంగా కనిపించే విశాఖ జిల్లాలోని సింహాచలం ఆలయంలోనూ రాజకీయాలకు కొదువ లేదు. స్ధానిక రాజకీయ నేతల అండతో సాగే ఇక్కడి రాజకీయాలను అర్ధం చేసుకోవడం, వాటిని నియంత్రించడం అంత సులువు కాదు. గతంలో అశోక్ గజపతిరాజు ఛైర్మన్గా ఉన్న సమయంలో ఆయన పెద్దరికానికి గౌరవం ఇచ్చి ప్రతీ విషయంలో జోక్యం చేసుకునేందుకు నేతలు ఇష్టపడే వారు కాదు. దీంతో అశోక్ అనుకున్నట్లే అక్కడి రాజకీయాలు నడిచేవి. కానీ వైసీపీ ప్రభుత్వం ఆయన స్ధానంలో రాత్రికి రాత్రే ఆదేశాలతో తీసుకొచ్చిన సంచయిత గజపతిరాజు లెక్కలు వేరు. ఆమె ఇంకా రాజకీయాల్లో ఓనమాలే నేర్చుకోలేదు. అయినా ప్రభుత్వం అనుకుందే తడవుగా ఆమెకు పెద్ద బాధ్యతలే దక్కాయి. అదే ఇప్పుడు ఆమెకు వరంగా, శాపంగా కూడా పరిణిమిస్తోంది.
ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చినా...
వైసీపీ ప్రభుత్వం కావాలని తెచ్చిపెట్టిన సంచయిత గజపతిరాజుకు ఆ మేరకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కూడా కల్పించింది. అదే సమయంలో సింహాచలం దేవస్ధానంలో రాజకీయాలను, ఆయన కమిటీ సభ్యులను కలుపుకుని వెళ్లాలని ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంది. కానీ ఆమె ఆలయ రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడంతో కమిటీని కానీ, అందులో సభ్యులను కానీ లెక్కచేసే పరిస్ధితి లేదు. దీంతో సంచైత విషయంలో ఏ అవకాశం దొరికినా దాన్ని రచ్చరచ్చ చేసేందుకు కమిటీ సభ్యుల్లో కొందరు శతవిథాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్ధానికంగా ఉన్న మీడియాను, విపక్ష టీడీపీతో ఉన్న సంబంధాలను వాడుకుంటున్నారు. ఇది అంతిమంగా సంచయితకు ఇబ్బందిగా మారిపోతోంది.
ఓఎస్టీ నియామకం వ్యవహారం...
ఉదాహరణకు సంచయిత తనకు ఓఎస్టీగా కార్తీక్ సుందర్ రాజన్ అనే వ్యక్తిని నియమించుకుంది. ఛైర్పర్సన్ చెప్పారు కాబట్టి ఆయన విధుల్లో చేరిపోవడం, కొంతకాలంగా ఆలయానికి సంబంధించిన గెస్ట్ హౌస్లోనే ఉంటూ ఆలయానికి సంబంధించిన ఫైల్స్ తనిఖీ చేయడం చేస్తున్నారు. దీనిపై మీడియాలో వ్యతిరేక కథనాలు వచ్చాయి. ఆలయంతో సంబంధం లేని వ్యక్తులు ఫైల్స్ ఎలా తనిఖీలు చేస్తారంటూ స్వయంగా ఈవో భ్రమరాంబ సైతం ఛైర్పర్సన్ సంచయితను ప్రశ్నిస్తూ లేఖ రాశారు. ఆ తర్వాత తనను బాధ్యతల నుంచి తప్పించారంటూ కోరడం, ప్రభుత్వం తప్పించడం జరిగిపోయాయి. ఆ లేఖ తాజాగా బయటపడటంతో సంచయిత ఏకపక్ష నిర్ణయాల వల్లే భ్రమరాంబ బాధ్యతల నుంచి తప్పుకున్నారా అన్న చర్చ మొదలైంది.
Recommended Video
ఆదుకోని బీజేపీ-కలిసి రాని వైసీపీ...
వాస్తవానికి ఈ వ్యవహారంలో తమ పార్టీకి చెందిన సంచయిత ఛైర్పర్సన్గా ఉన్నందున బీజేపీ ఆమెకు మద్దతుగా మాట్లాడాల్సి ఉంది. కానీ రాష్ట్ర బీజేపీ నేతలతో ఆమెకు సన్నిహిత సంబంధాలు లేవు. అలాగని కేంద్రంతో సంబంధాలేమన్నా బావున్నాయా అంటే అదీ లేదు. దీంతో సంచయిత కేవలం వైసీపీ ప్రభుత్వ మద్దతుతోనే పదవిలో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా వివాదాస్పదమైన సింహాచలం దేవాలయ వ్యవహారంలోనూ సొంత పార్టీ అయిన బీజేపీ ఆమెకు మద్దతివ్వడం లేదు. రాష్ట్రంలో చిన్నా చితకా సమస్యలపైనా స్పందించి ట్వీట్లు పెడుతున్న బీజేపీ పెద్దలు.. సంచయిత వ్యవహారంలో మాత్రం చూసీచూడనట్లుగా ఉండిపోతున్నారు. చివరికి అమెను ఏరికోరి పదవిలో తెచ్చిపెట్టిన వైసీపీ కూడా ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు. దీంతో సంచయిత పరిస్ధితి రెంటికీ చెడ్డ రేవడిగా మారుతోంది. అయితే స్ధానిక వైసీపీ నేతలు మాత్రం ఆమె ఏకపక్ష వైఖరే సమస్యలకు కారణమవుతోందని చెబుతున్నారు.