విశాఖలో చంద్రబాబుకు షాక్... పంచకర్ల బాటలో తిప్పల.. వైసీపీకి జై
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీకి ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీని వీడి వెళ్తున్న పరిస్థితులు స్థానిక పోరులో టీడీపీని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో నాయకులు బలంగా ఉన్నారని , ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవాలని భావిస్తున్న టీడీపీ వరుస షాకులతో కుదేలవుతుంది. కీలక జిల్లాలలో కూడా నేతలు వైసీపీ బాట పడుతున్న పరిస్థితి ఉంది .
విశాఖ జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది.ఇప్పటికే యలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు . ఇక ఆయన బాటలో తాజాగా గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. పంచకర్ల వైసీపీలో చారు ఆలోచనలో ఉండగా తిప్పల గురుమూర్తి మాత్రం వైసీపీలో చేరారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్ ఎంపీ విజాయసాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సమక్షంలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గురుమూర్తి రెడ్డి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విజయసాయిరెడ్డి తెలిపారు.2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గురుమూర్తిరెడ్డి ప్రజారాజ్యం అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.
ఆ తరువాత టీడీపీలో చేరారు. గాజువాకలో కీలక నేతగా ఉన్న ఆయన వైజాగ్ పట్ల సీఎం జగన్ సానుకూలంగా వ్యవహరించటం , పాలనా రాజధానిగా ఏర్పాటు చేస్తానని చెప్పటం తో వైసీపీ బాట పట్టారు. ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పిన పంచకర్ల రమేష్ బాబు కూడా చంద్రబాబు, లోకేష్ ల తీరుతోనే పార్టీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది.