జనసేనకు మరో నేత షాక్ .. మాజీ మంత్రి బాలరాజు కూడా జంపేనా ?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ నేతలు వరుస షాకులు ఇస్తున్నారు. ఒకపక్క జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంటే మరొక పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుండి జంప్ అవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణ, చింతలపూడి వెంకట్రామయ్య, పార్ధసారధి ఇప్పటికే పార్టీ కి గుడ్ బై చెప్పగా తాజాగా మరో నేత షాక్ ఇవ్వనున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
జనసేన టిక్కెట్ కోసం మాజీ మంత్రి బాలరాజు దరఖాస్తు, మీరూ పోటీ చేస్తారా.. చివరి తేది ఇదే
జనసేన పార్టీకి గుడ్ బై చెప్పనున్న మాజీ మంత్రి బాలరాజు
గత ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా పాడేరు నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన పసుపులేటి బాలరాజు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన బాలరాజు కొంతకాలంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు.పార్టీ కార్యక్రమాల్లో ఏ మాత్రం పాల్గొనటం లేదు. ఇక తాజాగా జనసేన విశాఖలో నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్ నేపధ్యంలో కూడా ఆయన పాల్గొనే ఆలోచనలో లేరు. జనసేన చేపట్టిన లాంగ్ మార్చ్ నిర్వహణ కోసం విశాఖలో ఏర్పాట్లపై నాదెండ్ల మనోహర్, నాగబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా బాలరాజు పాల్గొనలేదు. దీంతో ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేస్తారు అన్న చర్చ జరుగుతుంది.
విశాఖలో లాంగ్ మార్చ్ ... విశాఖ జిల్లా నేత నేడు రాజీనామా చేస్తారని జోరుగా చర్చ
ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం, నవంబర్ 3నవిశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎన్నికల ఓటమి నుండి పార్టీపై ఆసక్తి చూపించని మాజీ మంత్రి బాలరాజు శనివారం నాడు అంటే నేడు పార్టీకి రాజీనామా చేయనున్నట్లుగా సమాచారం. రేపు విశాఖలో లాంగ్ మార్చ్ ఉన్న నేపధ్యంలో ముందు రోజు నేత రాజీనామా చెయ్యనున్న పరిస్థితి జనసేనకు షాక్ అని చెప్పాలి. రాజీనామా అనంతరం ఆయన ఏ పార్టీలో చేరతారనే విషయంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఘోరంగా జనసేన పార్టీ ఓడిపోయిన నేపధ్యంలో బాలరాజు పార్టీకిదూరంగా ఉంటున్నారు.
పార్టీకి ఎన్నికల తర్వాత నుండి దూరంగా ఉంటున్న మాజీమంత్రి
పవన్ కళ్యాణ్ సైతం ఓటమి పాలు కావటం ఆయనకు పార్టీపై నమ్మకం తగ్గటానికి ప్రధాన కారణం అని స్థానిక నేతలు భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా వ్యవహరించిన బాలరాజు జనసేనలో చేరారు . గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన సీనియర్ నాయకుడు అయిన బాలరాజు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలో చేరి తన సత్తా చాటాలి అనుకున్నారు.కానీ అనూహ్యంగా ఓడిపోయారు.
జంపింగ్ లను ఆపలేకపోతున్న పవన్ .. బాలరాజు ఏ పార్టీలో చేరతారో
జనసేన తరపున పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన బాలరాజుకుగిరిజన ప్రాంతాల్లో మంచి పేరు ఉంది. ఇక ఆయన తన రాజకీయ భవిష్యత్ పై ఏం నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా రాజకీయాల్లో సీనియర్లు అయిన నేతలు ఒక్కొక్కరుగా జనసేన పార్టీ వీడి వెళ్లిపోతుంటే జనసేన భవిష్యత్ ఏంటి అన్న ప్రశ్న జనసైనికుల్లో ఉత్పన్నం అవుతుంది. ఒక పక్క పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చెయ్యటానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తూనే ఏపీలో అధికార పార్టీ వైఖరిపై కూడా నిప్పులు చెరుగుతున్నారు. కానీ జనసేన పార్టీ నుండి నేతలు వెళ్ళిపోవటం పార్టీకి మైనస్ గా మారుతున్నా పవన్ మాత్రం వారిని ఆపలేకపోతున్నారు.