విశాఖకు కేంద్రం మరో షాక్- వాల్తేరు లేకుండానే రైల్వేజోన్- పరిశీలనలోనే డీపీఆర్
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖపట్నానికి కేంద్రం వరుసగా షాకులిస్తోంది. ఇప్పటికే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తుండగా.. తాజాగా విభజన హామీల్లో ఒకటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్పైనా చేతులెత్తేసింది. ఇవాళ పార్లమెంటులో విశాఖ రైల్వే జోన్పై మాట్లాడిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందన చూస్తుంటే ఈ రైల్వే జోన్ కూడా ప్రత్యేక హోదా జాబితాలో చేరిపోయేలా కనిపిస్తోంది.
జగన్కు హ్యాండిచ్చిన కేంద్రం- హైకోర్టు తరలింపు ఆశలూ ఆవిరి- రాజధాని విచారణ తేలాకే క్లారిటీ
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్
2014లో ఏపీ, తెలంగాణ విభజన సందర్భంగా కేంద్రం మన రాష్ట్రానికి కొన్ని విభజన హామీలు ఇచ్చింది. వీటిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కూడా ఉంది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ అనతికాలంలోనే నరేంద్రమోడీ ఆధ్వర్యంలని కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే చేతులెత్తేసింది. జాతీయ విద్యాసంస్ధలు మినహాయిస్తే ఇక ఏపీకి ఇచ్చిన ప్రధాన విభజన హామీ విశాఖ రైల్వే జోన్ మాత్రమే. విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే ఈ రైల్వే జోన్ కోసం దక్షిణ మధ్య రైల్వేతో పాటు తూర్పు సరిహద్దు రైల్వేలోని నాలుగు డివిజన్లను కలిపి ఈ కొత్త జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం గత ఎన్నికలకు ముందు ప్రకటించింది.
విశాఖ రైల్వేజోన్పై కేంద్రం భారీ షాక్
ఇప్పటివరకూ విశాఖ రైల్వే జోన్ హామీ ఇచ్చి రెండేళ్లు దాటిపోతున్నా నోరు మెదపని కేంద్రం.. ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్న జీవీఎల్ ప్రశ్నకు రైల్వేమంత్రి పీయూష్ గోయల్ దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చారు. ఈ కొత్త రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పాటవుతుందో చెప్పలేమని గోయల్ తెలిపారు. అలాగే దీనికి ఎలాంటి నిర్దిష్ట గడువు కూడా పెట్టుకోలేదన్నారు. దీంతో రైల్వే జోన్పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తేలిపోయింది.
వాల్తేరు లేకుండానే విశాఖ రైల్వే జోన్
విశాఖలో ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో మొత్తం నాలుగు డివిజిన్లు చేర్చాలని గతంలో నిర్ణయించారు. వీటిలో విజయవాడ, వాల్తేరు, గుంటూరు, గుంతకల్ డివిజన్లు చేర్చాల్సి ఉంది. కానీ ఇవాళ పార్లమెంటులో మాట్లాడిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్... వాల్తేరు డివిజన్ను విశాఖ రైల్వేజోన్లో కలిపే అవకాశం లేదన్నారు. అంటే తూర్పు సరిహద్దు రైల్వేలోని ఇది కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వాల్తేరు లేకుండా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కావడం తథ్యంగా తెలుస్తోంది. విశాఖ వాసులకు ఇది మరో షాక్గా చెప్పవచ్చు.
ఇంకా రైల్వేబోర్డు పరిశీలనలో డీపీఆర్
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించింది. దీంతో త్వరలో రైల్వే జోన్ ఏర్పాటు కావడం ఖాయమని అంతా భావించారు. కానీ ఇవాళ కేంద్రం ఇచ్చిన సమాధానంలో విశాఖ రైల్వే జోన్పై డీపీఆర్ ఇంకా రైల్వే బోర్డు పరిశీలనలోనే ఉందని చెప్పి మరో షాకిచ్చింది. దీంతో డీపీఆర్ ఆమోదం అయితే కానీ కొత్త జోన్పై తదుపరి అడుగులు పడవనేది కూడా తేలిపోయింది. రైల్వే జోన్ ఏర్పాటు కోసం నిర్ణీత గడువు పెట్టుకోలేదని చెప్తున్న కేంద్రం.. ఇప్పుడు డీపీఆర్ ఆమోదంపైనా అదే కప్పదాటు వైఖరి ప్రదర్శించడం చూస్తుంటే ఇప్పట్లో రైల్వే జోన్పై ముందడుగు కష్టమేనని చెప్పవచ్చు.