Nutan naidu:బెయిల్ నిరాకరణ, భార్యకు కూడా.. ప్రాథమిక దశలో విచారణ..
దళిత యువకుడికి శిరోముండనం ఘటనలో సినీ నిర్మాత నూతన్ నాయుడుకు చుక్కెదురైంది. ఆయన భార్య ప్రియ మాధురి సహా మరో ఆరుగురు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. వారి వాదనను ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. బెయిల్ ఇవ్వాలని నూతన్ నాయుడు తరఫున లాయర్ వాదనలు వినిపించారు. అయితే కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని జడ్జీ వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు అని తేల్చిచెప్పారు.
నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం: లోకేష్ మండిపాటు, ముగ్గురి అరెస్ట్..
కేసు విచారణ ప్రాథమిక దశలో..
శ్రీకాంత్కు శిరోముండనం ఘటనపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలాది శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కేసు ప్రాథమిక దశలో ఉంది అని చెప్పగా.. జడ్జీ ఏకీభవించారు. నూతన్ నాయుడు సహా ఏడుగురికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇదిలా ఉంటే శ్రీకాంత్కు శిరోముండనం చేయాలని తాను చెప్పలేని నూతన్ నాయుడు నిన్న పేర్కొన్నారు. మూడు రోజుల కస్టడీలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తనకు ఆరోగ్యం బాగాలేదని మాత్రం పదే పదే చెప్పుకొచ్చాడు. దీంతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరును ఎక్కడ చెప్పలేదన్నారు. అలా చెప్పి పనులు చేయించుకునే శక్తి తనకు లేదన్నారు.
మొబైల్ చోరీ చేశాడని..
విశాఖపట్టణం సుజాతనగర్లో నూతన్ నాయుడు దంపతులు ఉంటున్నారు. ఇతని వద్ద గిరిప్రసాద్ నగర్కి చెందిన కర్రి శ్రీకాంత్ పనిచేసేవాడు. 4 నెలలు పనిచేసి.. ఇటివలే మానేశాడు. దీంతో నూతన్ నాయుడు మనుషులు.. అతని పిలిచి మాట్లాడారు. గతంలో ఇంటికి వచ్చిన బ్యూటీషియన్ సెల్ఫోన్ హ్యాక్ చేశారని చెప్పారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని కూడా తిట్టిపోశారు. సెల్ ఫోన్ పోయిందని నెపం వేశారు. తర్వాత మంగళిని పిలిపించి.. గుండు కొట్టించారు. తర్వాత శ్రీకాంత్ పెందుర్తి పోలీసులకు శిరోముండనం ఘటన గురించి ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏడుగురు సహా నూతన్ నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు తిరస్కరించింది.
రూ.12.05 కోట్లు వసూల్
శిరోముండనం కాదు..అంతకుముందు ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్టణం జిల్లా రావికమతానికి చెందిన నూకరాజు, తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్ రెడ్డి స్నేహితులు. నూకరాజు సీసీ కెమెరాలు, శ్రీకాంత్ రెడ్డి స్ధిరాస్తి వ్యాపారం చేసేవారు. వీరికి నూతన్ నాయుడితో పరిచయం ఏర్పడింది. వారి వద్ద డబ్బు ఉందని నూతన్ నాయుడు గ్రహించాడు. ఎస్బీఐలో మంచి ఉద్యోగాలు అని బురిడీ కొట్టించాడు. దక్షిణ భారత రీజియన్ డైరెక్టర్ పోస్టు కోసం శ్రీకాంత్ రెడ్డి రూ.12 కోట్లు, ఉద్యోగం కోసం నూకరాజు రూ.5 లక్షలు ఇచ్చారు. తమ జాబ్ గురించి అడిగితే అప్పుడు.. ఇప్పుడు అని కాలం వెళ్లదీశారు. అలా రెండేళ్లు గడిచిన.. వారి ఉద్యోగాలు రాలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.