విశాఖ ఏజెన్సీలో వింత వ్యాధి .. ఐదుగురు మృతి ... అలెర్ట్ అయిన వైద్యులు
ఒకపక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే, ఏపీలో మరో పక్క ఓ వింత వ్యాధి విశాఖ ఏజెన్సీలో ప్రబలుతోంది. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయితీ కరకవలస, చినరాభ గ్రామాలలో మూడు వారాల వ్యవధిలో వింత వ్యాధితో ఐదుగురు గిరిజనులు మరణించారు. జ్వరం , కడుపునొప్పితో పాటు కాళ్లు చేతులువిపరీతంగా వాపులు వచ్చి, అనారోగ్యం బారిన పడి వారు మృతి చెందినట్లుగా గుర్తించారు.
ప్రధానమంత్రి అవార్డ్స్ రేసులో గ్రేటర్ విశాఖ .. స్వచ్చత- ప్రజల భాగస్వామ్యంపై టాప్ 10 నగరాల పోటీ
విశాఖ ఏజెన్సీలో వింత వ్యాధి .. అలెర్ట్ అయిన వైద్య బృందం
ఈ వింత వ్యాధి గురించి తెలుసుకున్న అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ అధికారులతో మాట్లాడి, వైద్య బృందాన్ని అలర్ట్ చేశారు. ఐటిడిఏ పీవో ఆదేశాల మేరకు ఏడిఎంహెచ్వో ఏజెన్సీ గ్రామాలకు చేరుకొని వింత వ్యాధికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. అంతేకాదు అనారోగ్యం బారిన పడిన కరకవలస, సొట్టడి వలస, చినరాభ గ్రామాలకు చెందిన 18 మంది గిరిజనులను గజపతినగరానికి తరలించి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే వారందరికీ కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయినప్పటికీ విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జ్వరంతో పాటుగా, కాళ్లు చేతులు వాపులు, కడుపు నొప్పి... అడవి బిడ్డల కలవరం
విపరీతంగా జ్వరం రావడంతో పాటుగా, కాళ్లు చేతులు వాపులు, కడుపు నొప్పితో బాధపడుతూ విశాఖ ఏజెన్సీ వాసులు వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోయారు. వారందరికీ కరోనా నెగిటివ్ నిర్ధారణ అయింది. అయితే వారు చనిపోవడానికి గల కారణాలను వైద్య శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సహజంగా వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతాలలో రకరకాలు వైరస్లు ప్రబలుతుంటాయి. గిరిపుత్రులు వర్షాకాలంలో తీవ్ర అనారోగ్యానికి గురి అవుతూ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ప్రస్తుతం కూడా విశాఖ ఏజెన్సీలో అంతుచిక్కని వ్యాధితో గిరిజనులు కలవరపడుతున్నారు.
నిల్వ ఉంచిన పశు మాంసమే అనారోగ్యానికి కారణమా ?
అడవి బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారు. నిల్వ ఉంచిన పశు మాంసం తీసుకోవడంతో కరకవలస వాసులు అనారోగ్యం పాలవుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే అడవి బిడ్డల మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, కాళ్లు చేతులు ఎందుకు వాపులు వస్తున్నాయి అన్నదానిపై పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించి కారణాలు నిర్ధారించాల్సి ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఆసుపత్రులు చాలా దూరంగా ఉన్న కారణంగా, అధికారులు గ్రామానికి వచ్చి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Recommended Video
గ్రామంలోనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చెయ్యాలని విజ్ఞప్తి
అంతు చిక్కని వ్యాధితో అనారోగ్యంతో పోరాడుతున్న విశాఖ ఏజెన్సీ వాసులకు భీమవరం హెల్త్ సెంటర్ కు వెళ్లాలంటే సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుండగా, గజపతినగరం మెంటాడ హాస్పిటల్స్ కు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అందుకే ప్రభుత్వం గ్రామంలోనే కొద్ది రోజులపాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తే ప్రాణాలు పోకుండా కాపాడిన వారవుతారు అని గిరిపుత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.