విశాఖ కిమ్స్ ఆసుపత్రిలో చంద్రబాబు: నుదుట బొట్టుతో: స్పెషల్ అట్రాక్షన్గా గంటా
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కొద్దిసేపటి కిందటే సాగర నగరం విశాఖపట్నానికి చేరుకున్నారు. గాజువాకలోని కిమ్స్ ఐకన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకుడు పల్లా శ్రీనివాస రావును ఆయన పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. పల్లా శ్రీనివాస్ దీక్షను భగ్నం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.
పంచాయతీ ఎఫెక్ట్: మంగళగిరిలో నారా లోకేష్: జగన్ రెడ్డి ఒత్తిడి వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తమ పోరాటాలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. కొద్దిసేపటి కిందటే చంద్రబాబు విశాఖపట్నానికి చేరుకున్నారు. నేరుగా గాజువాకలోని కిమ్స్ ఐకన్ ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. నుదుట తిలకంతో కనిపించారాయన. ఆ సమయంలో చంద్రబాబు వెంట- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం లోక్సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇతర పార్టీ నేతలు ఉన్నారు.
టీడీపీకే చెందిన విశాఖపట్నం నార్త్ శాసన సభ్యుడు గంటా శ్రీనివాస రావు ఈ పర్యటనలో చంద్రబాబు వెంట కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి గానీ, చంద్రబాబు వెంట గానీ గంటా శ్రీనివాస రావు కనిపించడం చాలాకాలం తరువాత ఇదే తొలిసారి. కొద్దిరోజుల కిందటే ఆయన తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆసుపత్రికి వచ్చిన సందర్భంగా.. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. జై చంద్రబాబు అంటూ నినదించారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
అనంతరం ఆసుపత్రి నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆందోళన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఆందోళనను నిర్వహిస్తోన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న పల్లా శ్రీనివాసరావు దీక్షను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. దీక్షా శిబిరం నుంచి ఆయనను కిమ్స్ ఐకన్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను బలవంతంగా దీక్షా శిబిరంనుంచి ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు మరి కొన్నిగంటల్లో దీక్షా శిబిరాన్ని సందర్శించడానికి రావాల్సి ఉండగా.. ఆయన దీక్షను భగ్నం చేశారు.