బలవంతంగా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించి.. చంద్రబాబును పంపిన విశాఖ పోలీసులు.. ముగిసిన హైడ్రామా..
అధికార వైసీపీ శ్రేణుల అరుపులు.. కేకలు.. కోడుగుడ్లు, చెప్పులతో దాడులు.. పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహత్యాయత్నం బెదింరింపుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన ఉత్తరాంధ్ర పర్యటన రద్దయింది. రెండ్రోజుల పర్యటన కోసం గురువారం విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. సాయంత్రం చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు.. రాత్రికి ఆయనను విమానం ఎక్కించడంతో హైడ్రామా ముగిసినట్లయింది.
బలవంతంగా..
విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటనకు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు అరెస్టులకు పాల్పడటంపై చంద్రబాబు మండిపడ్డారు. అరెస్టయిన తర్వాత సుమారు 3 గంటలపాటు విశాఖ ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్ లోనే గడిపిన ఆయన.. బయట పరిస్థితి చక్కబడ్డతర్వాతైనా సిటీలోకి వెళతానని అన్నారు. కానీ పోలీసులు అందుకు అనుమతించలేదు. సెక్షన్ 151 నోటీసులపై అరెస్టయిన చంద్రబాబును పోలీసులు బలవంతంగా విమానం ఎక్కించి హైదరాబాద్ పంపేశారు. సమయానికి విజయవాడ ఫ్లైట్ లేకపోవడంతోనే ఈ పని చేసినట్లు తెలిసింది.
తగ్గిన టెన్షన్..
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాక ఎయిర్ పోర్టు వద్ద గురువారం ఉదయం నుంచి టెన్షన వాతావరణం నెలకొంది. వేల సంఖ్యలో వైసీపీ శ్రేణులు దూసుకొచ్చి చంద్రబాబు కాన్వాయ్ పై దాడికి దిగడం, బాబును ముందుకు కదలనీయకుండా అడ్డుకోవడం, వాళ్లతో టీడీపీ కార్యకర్తలు గొడవపడటం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇదిగో వదిలేస్తాం అని చెబుతూ.. చివరికి చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. మూడు గంటలు లాబీలోనే గడిపిన టీడీపీ అధినేతను చివరికి హైదరాబాద్ తరలించారు. బాబు వెళ్లిపోయిన వెంటనే వైసీపీ, టీడీపీ శ్రేణులు ఇంటిబాట పట్టారు. దీంతో టెన్షన్ సగడిపోయింది.
బాబుపై చేయిచేసుకున్నారా?
అరెస్టుకు ముందు జరిగిన తోపులాటలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తోససిన పోలీసులు.. చంద్రబాబు ఒంటిపైనా చేయివేసినట్లు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కూడా ఇదే ఆరోపణ చేశారు. పర్మిషన్ ఇచ్చిన పోలీసులే.. మళ్లీ సెక్షన్ 151 కింద అరెస్టు చేయడమేంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మొత్తంగా చంద్రబాబును విశాఖ నుంచి పంపేయడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.