TDP:టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కారు బీభత్సం: యువకుడికి గాయాలు.. అమరజీవి విగ్రహాన్ని ఢీ కొట్టి!
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కుమారుడు అప్పల్నాయుడి కారు బీభత్సం సృష్టించింది. మితి మీరిన వేగంతో ప్రయాణించిన కారు తొలుత- ఓ బైకర్ ను ఢీ కొట్టింది..ఫుట్ పాత్ ఎక్కేసింది. అదే వేగంతో- అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీ కొట్టి, నిలిచిపోయింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తోన్న జొమాటొ ఫుడ్ డెలివరి వ్యక్తి గాయపడ్డారు. ఆయనను కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు.
విశాఖపట్నం రామకృష్ణా బీచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పల్నాయుడే మద్యం మత్తులో కారును నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే- ఆయన సంఘటనాస్థలం నుంచి పరారైనట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత బండారు అప్పల్నాయుడు తన స్నేహితులతో కలిసి కారులో మద్యం మత్తులో రామకృష్ణా బీచ్ వైపు అతివేగంగా ప్రయాణించారని చెబుతున్నారు.
మద్యం మత్తులో ఉండటం వల్ల కారు అదుపు తప్పిందని, బైక్ పై వెళ్తోన్న జొమాటొ ఫుడ్ డెలివరి వ్యక్తిని ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. బైక్ ను ఢీ కొట్టిన తరువాత ఎడమ వైపు ఫుట్ పాత్ ను ఎక్కేసిన కారు.. అదే వేగంతో ప్రయాణించి- పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీ కొట్టి నిలిచిపోయింది. ఈ ఘటనలో కారు ముందు వైపు భాగం నుజ్జునుజ్జు అయింది.
ఈ ఘటనను కళ్లారా చూసిన ప్రత్యక్ష సాక్షులు కొందరు దాడికి దిగినట్లు చెబుతున్నారు. కారు అద్దాలను పగుల గొట్టారని, అప్పల్నాయుడితో పాటు అతని స్నేహితులకు దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు స్థానికుల చేతుల్లో నుంచి తప్పించుకుని పారిపోయారని అంటున్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ఆరంభించారు. అప్పల్నాయుడు, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.