సింహాచలంలో నారా లోకేష్: మున్సిపాలిటీల్లో వైసీపీ హవాను అడ్డుకోగలరా? 8 వరకు బిజీగా
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారబరిలో దిగారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఇందులో పాల్గొనడానికి ఈ తెల్లవారు జామునే సాగర నగరానికి చేరుకున్నారు. విశాఖ సహా ఈ నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో పర్యటిస్తారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసేంత వరకూ నారా లోకేష్ పర్యటనలు కొనసాగుతాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో నారా లోకేష్, దక్షిణాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్ను రూపొందించుకున్నారు.
స్వామివారికి పూజలు..
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొడానికి విశాఖకు వచ్చిన నారా లోకేష్.. మొదట సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆయన వెంట ఉన్నారు. ఈ తెల్లవారు జామున సింహాచలానికి వచ్చిన ఆయనను పార్టీ నాయకులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు పలికారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు.
8 వరకూ బిజీగా నారా లోకేష్..
ఆలయం వెలుపల పలువురు టీడీపీ నాయకులు నారా లోకేష్ను కలిశారు. చిత్రపటాన్ని బహూకరించారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి విశాఖకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 8వ తేదీ వరకు నారా లోకేష్ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనబోతోన్నారు. శుక్ర, శనివారాల్లో విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నారా లోకేష్ ప్రచారం చేస్తారు. 7వ తేదీన మండపేట, పిఠాపురం, 8వ తేదీన మచిలీపట్నం, పెడనలోనూ నారాలోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
విజయవాడ షెడ్యూల్లో మార్పులు..
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు శుక్రవారం రాష్ట్రస్థాయి బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. విజయవాడలో నారా లో్కేష్ ఎన్నికల ప్రచార షెడ్యూల్లో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ బంద్కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆయన.. వామపక్షాలు, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారానికి బదులుగా బంద్లో పాల్గొనే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విజయవాడలో ఆయన షెడ్యూల్ ఎలా ఉంటుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. బంద్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన చిత్తూరు జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.
వైసీపీ హవాను నారా లోకేష్ అడ్డుకుంటారా?
పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపాలిటీల్లోనూ వైసీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే 13 మున్సిపాలిటీలను వైసీపీ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. చిత్తూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు కూడా దాదాపు ఏకగ్రీవమైనట్టే. తుని, ఆత్మకూరు, పలమనేరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్, పుంగనూరు, నాయుడుపేట, రాయచోటి, ఎర్రగుంట్ల, సూళ్లూరుపేట, మదనపల్, డోన్ మున్సిపాలిటీల్లో మెజారిటీ వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగలిగింది. ఈ పరిణామాల మధ్య నారా లోకేష్ ఎన్నికల ప్రచార కార్యక్రమాాల్లో పాల్గొనబోతోన్నారు. వాటి ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠతను రేపుతోంది.