చక్రం తిప్పిన అవంతి: టీడీపీకి గుడ్ బై: వైసీపీలోకి అడారి కుటుంబం ఎంట్రీ!
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఊహించిన దెబ్బ తగిలింది. దాదాపు 22 సంవత్సరాల పాటు తెలుగుదేశంలో కొనసాగిన అడారి కుటుంబం.. పార్టీకి గుడ్ బై చెప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకొన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వారు పార్టీలో చేరారు. అనారోగ్యం కారణం వల్ల విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన కుమారుడు అడారి ఆనంద్, కుమార్తె రమా కుమారి.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వారితో పాటు విశాఖ డెయిరీకి చెందిన 12 మంది డైరెక్టర్లు కూడా వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. కాగా- అడారి కుటంబం వైసీపీలో చేరడం వెనుక పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చక్రం తిప్పినట్లు చెబుతున్నారు.
రెండు దశాబ్దాలుగా టీడీపీలో
ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడిగా అడారి తులసీరావుకు పేరుంది. ఆయన కుమారుడు అడారి ఆనంద్, కుమార్తె రమా కుమారి 22 సంవత్సరాల నుంచీ టీడీపీలో కొనసాగుతూ వస్తున్నారు. విశాఖపట్నం జిల్లా యలమంచిలి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ప్రస్తుతం రమా కుమారి పని చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అడారి ఆనంద్ విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ వెంకట సత్యవతి చేతిలో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి అడారి కుటుంబం తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటోంది. వారిని వైసీపీ వైపు ఆకర్షితులను చేయడంలో జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ చక్రం తిప్పారని అంటున్నారు. అవంతి శ్రీనివాస్ ప్రోద్బలంతోనే అడారి కుటుంబం మొత్తం టీడీపీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.
ఏడుకొండలపై ఏసుమందిరాలు: దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు
రైతులకు ఇస్తోన్న ప్రాధాన్యతను చూసే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవసాయరంగానికి, రైతన్నలను ఆదుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, వాటి పట్ల ఆకర్షితులమైన తాము వైఎస్ఆర్సీపీలోకి చేరినట్లు అడారి ఆనంద్, రమా కుమారి తెలిపారు. రైతులు, పాడి పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, దీనికోసం సమగ్ర ప్రణాళికను రూపొందించామని వైఎస్ జగన్ తమకు తెలిపారని అన్నారు. రైతుల కోసం కృషి చేస్తోన్న ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేయాలనే ఉద్దేశంతోనే తాము వైఎస్ఆర్సీపీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ అడారి కుటుంబం తమ పార్టీలో చేరడం పట్ల ఆనందంగా ఉందని అన్నారు. విశాఖ డెయిరీ పాలక బోర్డు డైెరెక్టర్లు జిల్లాలో పార్టీ మరింత బలోపేతమైందని అన్నారు. విశాఖ డెయిరీ రైతులకు అండగా ఉంటానని, వారందరికీ తాను న్యాయం చేస్తానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారని అన్నారు.
త్వరలో మరిన్ని చేరికలు
తెలుగుదేశం పార్టీ నుంచి త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి అన్నారు. ఉత్తరాంధ్ర నుంచే కాకుండా.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచీ తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు తమ పార్టీలో చేరబోతున్నారని అన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వరుపుల రాజా త్వరలో వైసీపీ కండువాను కప్పుకొనే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యానాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.