రాజీనామాకు సిద్ధమైన గంటా- స్పీకర్కు లేఖ- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎఫెక్ట్
ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కేంద్రం తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో స్ధానికంగా రాజకీయ పార్టీలన్నీ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రోడ్లపై ఆందోళనలు నిర్వహిస్తండగా.. తాజాగా విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామాకు సిద్ధమయ్యారు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తానంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఇవాళ లేఖ రాశారు. ప్రైవేటీకరణపై ఆదేశాలు వచ్చినవెంటనే తన పదవిని వదులుకుంటానని లేఖలో గంటా తెలిపారు. దీంతో స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో తొలి రాజీనామా గంటా శ్రీనివాస్దే కానుంది. ఇప్పటికే స్లీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అధికార పార్టీ నేతలు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు గంటా శ్రీనివాస్ భారీ ప్లాన్తో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్పై కేంద్రం నిర్ణయం అమల్లోకి వచ్చిన వెంటనే రాజకీయ జేఏసీని ఏర్పాటు చేసి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తానని గంటా ప్రకటించారు. తాను మాటల మనిషిని కాదని, చేతల మనిషి అని గంటా వ్యాఖ్యానించారు. దీంతో గంటా చేయబోయే పోరులో ఎవరెవరు కలిసి రానన్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.