టీడీపీపై బాంబు పేల్చిన వాసుపల్లి గణేష్: మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీగా
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పిన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తాజాగా బాంబు పేల్చారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన రెండురోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఆయన కుమారులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆ పార్టీ కండువాను కప్పుకొన్నారు. ఈ వలసల పరంపర ఆయనతో ఆగేలా కనిపించట్లేదు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడానికి మరి కొందరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని తాజాగా వాసుపల్లి గణేష్ వెల్లడించారు.
వైఎస్ జగన్ నివాసం ముట్టడి: జైశ్రీరామ్ నినాదాలు: భారీగా అరెస్టులు.. ఉద్రిక్తత
ఉత్తరాంధ్ర తలరాత మార్చేలా..
కొద్దిసేపటి కిందట ఆయన విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను ఎందుకు తెలుగుదేశం పార్టీని వీడాల్సి వచ్చిందో వివరించారు. విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించడం వల్ల ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి నోచుకుంటుందని, టీడీపీ దీన్ని అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో పుట్టి, పెరిగిన తాము విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించడాన్ని ఎలా వ్యతిరేకించగలమని అన్నారు. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంగా ఉంటోందని, వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఈ ప్రాంతం తలరాత మారుతుందని వాసుపల్లి చెప్పారు.
90 శాతం మేనిఫెస్టో..
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఎప్పుడూ లేని అభివృద్ధి పనులు వైఎస్ఆర్సీపీ పాలనలో కొనసాగుతున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే 90 శాతం మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీగా వైఎస్ఆర్సీపీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమతం కాలేదని, వాస్తవ రూపం దాల్చాయని అన్నారు. సుమారు 60 వేల వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు.
మనసు చంపుకోవాల్సి వచ్చింది..
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రజా సంక్షేమమే పరమావధిగా దూసుకెళ్తోందని, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమాలు గానీ, నిరసన ప్రదర్శనలను గానీ నిర్వహించాల్సిన పరిస్థితి లేదని అన్నారు. ఒకరంగా చెప్పాలంటే వైఎస్ జగన్ ప్రతిపక్ష పార్టీకి పని లేకుండా చేశారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలంటూ చంద్రబాబు నాయుడు తమపై ఒత్తిడి తీసుకొచ్చారని, లేని ఉద్యమాలను ఎలా పుట్టించగలమని ఆయన వాసుపల్లి ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేగా తాను సొంత పార్టీ ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం తిరిగినా.. ఒక్క పనీ జరగలేదని చెప్పారు.
పేదలకు దూరం..
విశాఖను రాజధానిగా వ్యతిరేకించడం, సంక్షేమ పథకాలు, ఇళ్ల నిర్మాణంపై న్యాయస్థానంలో పిటీషన్లను వేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ.. పేదలకు దూరమైందని వాసుపల్లి గణేష్ అన్నారు. పార్టీకి ఏ పేదలు అండగా ఉంటూ వచ్చారో.. వారే దూరం అయ్యారని, ఫలితంగా- టీడీపీకి భవిష్యత్తు ఉండదని చెప్పారు. మరో 20, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొనసాగడం ఖాయమని అన్నారు. క్షేత్రస్థాయిలో.. గ్రామస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిమానం అలాంటిదని చెప్పారు.
తనతో పాటు మరో నలుగురు..
రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన ఒరవడిని వైఎస్ జగన్ తీసుకొచ్చారని వాసుపల్లి అన్నారు. విప్లవాత్మక మార్పును తెచ్చారని, దాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. ప్రజల అండ వైసీపీ ప్రభుత్వానికి ఉందని, ఇప్పట్లో అది చెక్కుచెదిరేది కాదని చెప్పారు. ఈ పరిస్థితులను గమనించడం వల్లే మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారని వాసుపల్లి స్పష్టం చేశారు. వారెవరనేది త్వరలో ప్రజలే చూస్తారని అన్నారు. పరిపాల రాజధానిగా విశాఖను ప్రకటించడాన్ని తాను అప్పుడే స్వాగతించానని గుర్తు చేశారు.