జగన్ పై విమర్శలు చేసిన ఎమ్మెల్యే అరెస్ట్.. బెయిల్ పై రిలీజ్ .. కక్ష సాధింపు చర్య అంటున్న టీడీపీ
ఏపీలో వైఎస్ జగన్ మార్క్ పాలన ప్రారంభం అయ్యింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు.టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఏపీ సీఎం జగన్ ను, అలాగే ప్రధాని మోడీపై వ్యక్తిగత విమర్శలు చేశారంటూ దాఖలైన పిటీషన్, అందించిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు . ఇక ఈ కేసులో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ఎంవీపీ కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. కొద్దిసేపటి తర్వాత స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు.
విదేశీ పర్యటన వాయిదా వేసుకున్న చంద్రబాబు.. రీజన్ ఇదేనా ?
విజయోత్సవ ర్యాలీలో జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.. వైసీపీ ఫిర్యాదు
ఏపీ సార్వత్రికి ఎన్నికల్లో వైసీపీ 151 ఎమ్మెల్యే సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీ తరఫున కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. విశాఖ తూర్పు నియోజకవర్గ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధించారు. టీడీపీ తరఫున ఎన్నికైన తర్వాత విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన వెలగపూడి రామకృష్ణబాబు ప్రధాని నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ, జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంల ద్వారా మోసం చేసి గెలిచారని ఆరోపించారు.అంతే కాదు అసభ్యకరమైన పదజాలంతో రెచ్చిపోయారు. ఈ వీడియో ఆధారంగా.. వైసీపీ నుంచి పోటీచేసిన అభ్యర్థి విజయ నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెలగపూడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వ్యాఖ్యల వీడియో పోలీసులకు అందజేత.. కేసు నమోదు .. వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్
వీడియోను పరిశీలించిన పోలీసులు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతోపాటు.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించారని రామకృష్ణబాబుపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఐపీసీ 294 (బి), 188 సెక్షన్ల కింద క్రైమ్ నంబర్ 158/19తో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్టేషన్కు వచ్చి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ తీసుకోవాలంటూ ఎమ్మెల్యేను ఆదేశించారు.దీంతో బుధవారం ఆయన పోలీస్ స్టేషన్ ఎదుట హాజరయ్యారు. వెలగపూడి రామకృష్ణబాబును అరెస్ట్ చూపించి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది వైసీపీ అని మదిపడుతున్న టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు
స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు. అందుకు తనపై పెట్టిన కేసే ఒక ఉదాహరణ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అక్రమ కేసులు బనాయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హెచ్చరించారు . మరోవైపు ఎమ్మెల్యే తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు .