జగన్ను విప్లవవీరుడిగా అభివర్ణించిన చంద్రబాబు: టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాకు రెడీ
విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీెకరణ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో నూతనోత్తేజాన్ని కల్పించినట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించడానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ నార్త్ శాసన సభ్యుడు గంటా శ్రీనివాస రావు రాజీనామా చేశారు. మరింత మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
SKOCH CM of the Year: జగన్ పాలనకు పట్టం: జనం రివార్డులే కాదు..బెస్ట్ సీఎం అవార్డు కూడా
త్యాగాలకు వెనుకాడబోం..
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ను ఆయన పరామర్శించారు. అనంతరం దీక్షా శిబిరంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడాన్ని నిలువరించడానికి తాము ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల గురించి అధికార వైఎస్సార్సీపీ నాయకులు ప్రస్తావిస్తున్నారని, ఒక్క నిమిషంలో రాజీనామాలు చేస్తారని ప్రకటించారు.
అన్ని సభ్యత్వాలకూ ఒక్క నిమిషంలో
ఒక ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి కేంద్రంతో పోరాడితే రాష్ట్ర ప్రజలందరూ ఆయన వెంట ఉంటారని అన్నారు. తాను కూడా వెంట వస్తానని చంద్రబాబు చెప్పారు. రాజీనామాలు చేయాల్సిన పరిస్థితే వస్తే.. ఒక్క నిమిషం కూడా పదవి గురించి ఆలోచించబోమని చెప్పారు. లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి స్థానాల సభ్యత్వానికి రాజీనామాలు చేస్తామని తేల్చి చెప్పారు. స్టీల్ప్లాంట్ లేకపోతే విశాఖ లేదని, నాడు జరిగిన ప్రాణత్యాగాలను నేడు జగన్ అవమానిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. విశాఖ ఎప్పటికీ రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగానే ఉంటుందని స్పష్టం చేశారు.
విప్లవవీరుడిగా ఉంటావో.. వెన్నుపోటుదారుడిగా మిగులుతావో..
విశాఖపట్నం ప్రైవేటీకరణను అడ్డుకో గలిగితే జగన్ రెడ్డి.. విప్లవ వీరుడిగా మిగిలిపోతారని చంద్రబాబు అన్నారు. విప్లవ వీరులను స్ఫూర్తిగా తీసుకుని ఆయన పోరాడాలని సూచించారు. దీనికి భిన్నంగా- విశాఖ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమానికి వెన్నుపోటు పొడవడానికీ వెనుకాడబోరని చెప్పారు. జగన్ రెడ్డికి వెన్నుపోటు బాగా తెలిసిన విద్య అని ఎద్దేవా చేశారు. అమరావతిలో ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ పాలన ప్రారంభమైందని విమర్శించారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేలా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. విశాఖ అంటే తనకు ప్రాణమని, నాడు విశాఖ ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే అమరావతిని రాజధానిగా ప్రకటించామని స్పష్టంచేశారు.
పల్లా శ్రీనివాస్ దీక్ష విరమణ
అంతకుముందు చంద్రబాబు గాజువాకలోని కిమ్స్ ఐకన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావును పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. పల్లా శ్రీనివాస్ దీక్షను భగ్నం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడాన్ని అభినిందించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అలాంటి స్ఫూర్తిని నింపాలని సూచించారు. అనంతరం నిమ్మరసం తాగించి ఆయనతో దీక్షను విరమింపజేశారు.