వలంటీర్లు చేస్తున్నవి వెధవ పనులు: వారిపై మమకారం ఎందుకు: సిగ్గుపడండి: వంగలపూడి అనిత
అమరావతి: వలంటీర్ల వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటు విమర్శలు చేశారు. వలంటీర్లు అత్యాచారాలకు పాల్పడుతున్నారని, వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవట్లేదని ఆరోపించారు. వలంటీర్లలో 90 శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారని, వారిని ఉద్యోగులుగా ఎలా గుర్తిస్తారని ఆమె నిలదీశారు. ప్రభుత్వ ఖజానా నుంచి వారికి నెలనెలా వేతనాన్ని ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని అన్నారు.
టీడీపీలో మరో వికెట్: మాజీ ఎమ్మెల్యే గుడ్బై: చంద్రబాబు సొంత జిల్లాలో..ఆప్తుడిగా: వైసీపీ వైపు
గురువారం ఆయన జూమ్ యాప్ ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతపురం జిల్లా శింగనముల మండలం చిన్నమట్లగొంది గ్రామంలో వలంటీర్గా పనిచేస్తున్న సంతోష్ అదే ప్రాంతానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతాన్ని ఆమె ప్రస్తావించారు. వలంటీర్లు వెధవలుగా తయారయ్యారని, వారు చేస్తున్నవి వెధవ పనులని ఘాటుగా విమర్శించారు. పైగా వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని ఆరోపించారు.
వైఎస్ జగన్కు వలంటీర్ల మీద ఎందుకు అంత మమకారమని ప్రశ్నించారు. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా? లేక వైసీపీ తరఫున పని చేసే కార్యకర్తలా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నిలదీశారు. వైసీపీ కార్యకర్తలుగా భావించాల్సి వస్తే.. వారికి నెలనెలా అయిదు వేల రూపాయల గౌరవ వేతనాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అసలు మహిళా కమిషన్ అనేది ఉందా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళలు, వారి రక్షణ గురించి గొప్ప గొప్ప మాటలు పలికిన వాసిరెడ్డి పద్మ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళా కమిషన్ వంటి గౌరవ ప్రదమైన స్థానంలో కూర్చున్న ఆమె మహిళల కోసం ఎలాంటి రక్షణాత్మక చర్యలను చేపట్టాలని నిలదీశారు. అనంతపురం జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వలంటీర్ మీద దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Recommended Video
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 400 అత్యాచార సంఘటనలు చోటు చేసుకున్నాయని, దీనిపై ఏం సమాధానం ఇస్తారని వంగలపూడి అనిత అన్నారు. ఒక్క ఏడాది కాలంలోనే ఇన్ని అత్యాచారాలు జరిగినందుకు సిగ్గుపడాలని చెప్పారు. దిశ చట్టాన్ని తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకొన్నా దాని ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని అన్నారు. ఓ మహిళను హోం మంత్రిగా నియమించినందుకు తాను ఆనందించానని, తీరా ఇప్పుడామె కీలుబొమ్మలా మారారని అన్నారు.