రాజధానిలో టీడీపీ బృందం ...బొత్సా జోకర్ అన్న అచ్చెన్నాయుడు, జగన్ పై గల్లా జయదేవ్ ఫైర్
ఏపీ రాజధానిపై రగులుతున్న రగడ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఏపీలో పెను దుమారం రేపాయి.ఏపీ రాజధాని అమరావతి పై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు.ఇక గల్లా జయదేవ్ సైతం రాజధాని నిర్మాణంపై జగన్ ఇప్పటికీ ఏమి మాట్లాడలేదని పేర్కొన్నారు. అమరావతి పై తప్పుగా మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ తప్పు ఒప్పుకోవాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
బొత్సా రాజధానిపై చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ గా టీడీపీ నేతల రాజధాని పర్యటన
రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిలో ఒక్క ఇటుక వెయ్యలేదంటూ మాట్లాడటం సరికాదని పేర్కొన్న అచ్చెన్నాయుడు బొత్స ఒక జోకర్గా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష ఉప నేత అచ్చెనాయుడు నేతృత్వంలో టిడిపి నేతల బృందం అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. వైసీపీ మంత్రులు అమరావతి పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, అమరావతి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న తరుణంలో టిడిపి నేతల బృందం రాజధాని పర్యటన ఏపీలో ఆసక్తికరంగా మారింది.
బొత్సా వ్యాఖ్యలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు
అమరావతిలో నిర్మాణాలు లేవంటూ మంత్రి బొత్స చేసిన కామెంట్ల నేపథ్యంలో రాజధానిలో పర్యటించిన టిడిపి నాయకులు వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు ప్రభుత్వ పెద్దలపై విరుచుకుపడ్డారు. అమరావతిలో 12 టవర్లతో శాసన సభ్యులకు 288 ప్లాట్లు సిద్ధం అయ్యాయని వివరించారు. రాజధాని పై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజధానికి వస్తే నిర్మాణాలు ఎలా ఉన్నాయో తాము చూపిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
రాజధాని పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారనే ఈ కుట్ర అన్న టీడీపీ నేత
జగన్ సొంత ఇంటి నిర్మాణం కంటే క్వాలిటీగా నిర్మాణాలు ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక రాజధాని పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారని, అందుకే రాజధానిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు. అధికార వైసిపి 60 రోజుల్లో పూర్తి అయ్యే నిర్మాణాలను కావాలని శాడిస్ట్ ఆలోచనతో నిర్మాణం పూర్తి కాకుండా ఆపేశారని ధ్వజమెత్తారు. ఇక అమరావతి నగరాన్ని గ్రాఫిక్స్ అని నోటి మాటలు చెప్పడం కాదు, ఇక్కడకు వచ్చి చూసి మాట్లాడాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.
బొత్సా లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలన్న అచ్చెన్నాయుడు
రాజధాని నిర్మాణం పై అవాకులు చెవాకులు పేలినందుకు మంత్రి బొత్స లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అంతే కాదు అమరావతిలో అంతా అవినీతి జరిగిందన్నారు. మరి ఇంతకీ ఏం తేల్చారు అని ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మొత్తానికి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ అచ్చెన్న బేషరతుగా బొత్స సత్యనారాయణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ నోటి వెంట ఇప్పటికీ రాజధాని అమరావతి పేరు రాలేదన్న గల్లా జయదేవ్
ఇక గల్లా జయదేవ్ రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉంటే నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఆనాడు అమరావతికి వచ్చామని పేర్కొన్నారు . అందరికీ అందుబాటులో ఉండేలా చంద్రబాబు రాజధానిని నిర్ణయించారని పేర్కొన్న గల్లా జయదేవ్ రాజధాని అంశాన్ని వివాదం చేస్తుందని మండిపడ్డారు. రాజధాని ఎవరి కోసం అనేది వైసీపీ ఆలోచన చెయ్యాలని ఆయన సూచించారు. తెలంగాణకు 75 శాతం ఆదాయం రాజధాని హైదరాబాద్ నుంచే వస్తుందన్నారు.సీఎం జగన్ నోటి వెంట ఇప్పటికీ రాజధాని అమరావతి పేరు రాలేదని గల్లా జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని ప్రాంతంలో చేపట్టిన పనులు, ప్రణాళికపై టీడీపీ నేతల వివరణ
కావాలనే రాజధానిని కాంట్రవర్సీ చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలో పేదలకు 5 వేల ఇళ్లు నిర్మాణం పూర్తి అయ్యిందని పేర్కొన్నారు గల్లా జయదేవ్ . రాజధానిలో కోటి ఎస్ఎఫ్టీ స్థలం సిద్ధంగా ఉందన్నారు. అమరావతిలో నిర్మాణాలు లేవన్న ఆరోపణలకు కౌంటర్గా టీడీపీ నేతలు చేపట్టిన పర్యటనలో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించనున్నారు. టీడీపీ హయాంలో రాజధాని ప్రాంతంలో చేపట్టిన పనులు, ప్రణాళికపై టీడీపీ నేతలు వివరణ ఇస్తున్నారు .వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.