విజయమ్మను ఓడిస్తే విశాఖకు హుదూద్ తుఫాన్ వచ్చిందని సంబరాలు చేసుకున్న చరిత్ర వైసీపీది... అనిత ఫైర్
విశాఖ విధ్వంసానికి కుట్రపన్నిన చరిత్ర వైసీపీ నేతలదేనని, చంద్రబాబు పై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసిపి నేతలపై ఎదురుదాడికి దిగారు. జగన్ రెడ్డి మెప్పుకోసం గుడివాడ అమర్ నాథ్ లాంటి నేతలు నోరు పారేసుకుంటున్నారు అని ఆమె విమర్శించారు. వైసిపి కార్యాలయాలకు త్వరలో టూలెట్ బోర్డ్ లు పెట్టే రోజులు వస్తాయని అనిత విమర్శనాస్త్రాలు సంధించారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ నేతలకు తప్పకుండా బుద్ధి చెప్తారని ఆమె వైసీపీ నేతలను హెచ్చరించారు.
విజయమ్మను ఓడించినందుకు విశాఖకు హుదూద్ తుఫాన్ వచ్చిందని సంబరాలు చేసుకున్న చరిత్ర వైసిపిదని అనిత విమర్శలు గుప్పించారు. కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారని ఆమె విమర్శించారు. టిడిపి నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, ఏ ఒక్క ఆరోపణలకు ఆధారాలు చూపించలేక పోయిందని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతి కి మరణశాసనం రాసారని పేర్కొన్న అనిత, జగన్ తన స్వార్ధ ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు గా అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్రలో వేల ఎకరాలు అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని, కేవలం వైసీపీ నేతల కబ్జాలకు, అవినీతి, అక్రమాలకు మాత్రమే విశాఖ రాజధాని అని ఆమె ఆరోపించారు. చంద్రబాబు హయాంలో విశాఖకు పరిశ్రమలు వస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని వెళ్లగొట్టి విశాఖ అభివృద్దిని నాశనం చేస్తుందని ఆమె విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో వైసిపి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయి కూడా, అసత్యాలు మాట్లాడుతుందని మండిపడ్డారు. ఫోన్ టాపింగ్ ను అత్యాచారంతో పోల్చిన హోంమంత్రి సుచరిత తీరు దుర్మార్గం అంటూ అనిత నిప్పులు చెరిగారు. ఫోన్ టాపింగ్ పై ఆధారాలు చూపించమంటున్న ప్రభుత్వం, టిడిపి నేతలపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై కూడా ఆధారాలు చూపించాలని నిలదీశారు టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత.