పవన్ కల్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం, బీజేపీ కామెంట్లపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీపై చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. బీజేపీ విధానాలపై వ్యతిరేకించానే తప్ప.. పార్టీపై కాదని జనసేనాని అనడంతో ఏపీలో హీట్ పుట్టించింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు స్పందించారు. బీజేపీపై పవన్ చేసిన కామెంట్లు అతని వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. పవనే కాదు చాలా మంది కూడా బీజేపీ-టీడీపీ-జనసేన గత ఎన్నికల్లో పనిచేస్తే ఎలా ఉంటుంది అనే చర్చిస్తున్నారని చెప్పారు.
రాజధానిలో టీడీపీ బృందం ...బొత్సా జోకర్ అన్న అచ్చెన్నాయుడు, జగన్ పై గల్లా జయదేవ్ ఫైర్
ఏం జరిగిందో..
గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడాన్ని ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు. వైసీపీ గెలవడంతో ఏదో మర్మం దాగి ఉందని కూడా అభిప్రాయపడుడుతున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తే పరిస్థితి మరోలా ఉండేదని ప్రజలే చర్చించుకుంటున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.
ఆర్నెల్లలో అరాచకాలు..
ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతుందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ఆర్నెల్లలో వైసీపీ సర్కార్ చేయాల్సిన అరాచకాలు చేసిందన్నారు. బాధ్యతగల ప్రతిపక్షంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకుటున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.
వ్యతిరేకం కాదు.. కానీ
బీజేపీకి జనసేన వ్యతిరేకం కాదు అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని మీడియా ప్రతినిధులు అచ్చెనాయుడికి గుర్తుచేస్తే.. టీడీపీ కూడా వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధినేతలతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. అలా అని జగనతో కూడా శత్రుత్వం లేదని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలపేనే తమ ఆగ్రహం అని స్పష్టంచేశారు.
పొత్తుల చర్చే లేదు
ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలవుతోందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సమయంలో పొత్తులు, వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి చర్చకు తావులేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టటడే తమ పని అని వెల్లడించారు. ఇసుక సమస్యపై పోరాడామని.. రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరినట్టు వివరించారు. రాష్ట్రంలో జరిగే అన్యాయాలపై అందరం కలిసికట్టుగా పోరాడాలని స్పష్టంచేశారు.
సమస్యలపై పోరాటం
ఇసుక సమస్య, అమరావతి రాజధాని నిర్మాణ సమస్యలపై ప్రభుత్వ వైఖరిని టీడీపీ ధీటుగా తిప్పికొట్టిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ అంశాలపై 17 రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందజేశామని తెలిపారు. టీడీపీతో కలిసి పనిచేసేందుకు బీజేపీ సుముఖంగా లేదనే వార్తలు ఊహాజనితమని కొట్టిపారేశారు. ఆ విధంగా మీకు మీరే ప్రశ్న వేసుకొని జవాబు కూడా మీరే చెబుతారా అని అచ్చెన్నాయుడు మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.