షాకింగ్..యువతికి మత్తిచ్చి మైనర్ల సామూహిక అత్యాచారం...విశాఖ కైలాసగిరిలో దారుణం
మానవత్వం రోజు రోజుకీ మంటగలిసి పోతుంది. రాక్షసత్వం రాజ్యమేలుతుంది. ఎవరూ ఊహించని పరిణామాలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. మైనర్ బాలురు యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన సమాజంలో ప్రతి ఒక్కరు షాక్ కి గురి చేస్తుంది. మత్తు మందు ఇచ్చిమరీ అత్యాచారానికి పాల్పడటం అందర్నీ నివ్వెరపోయేలా చేస్తుంది.విశాఖలోని కైలాసగిరిలో జరిగిన ఈ దారుణం తెలుగు రాష్ట్రాల్లో పిల్లల మానసిక స్థితి ఏవిధంగా ఉంటుందో తెలియజేస్తుంది.
విశాఖ కైలాసగిరిలో యువతిపై బాలుర గ్యాంగ్ రేప్
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే విశాఖ పట్టణంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాస గిరిలో ఒక యువతిని ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. కైలాసగిరి చూడడానికి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో 22 సంవత్సరాల యువతి, ఆమెతో పాటు 18 ఏళ్ల బాలుడు వెళ్లారు. కైలాసగిరి ప్రాంతాన్ని కాసేపు చూసిన తర్వాత ఒక ప్రదేశంలో కూర్చున్నారు.ఆ యువతికి బాలుడు కూల్ డ్రింక్ ఇచ్చాడు. అయితే అందులో మత్తు మందు కలిపి ఇవ్వడంతో ఆ కూల్ డ్రింక్ తాగిన యువతి మత్తు లోకి జారుకుంది.
మత్తు మందు కూల్ డ్రింక్ లో కలిపిచ్చి దారుణం
పక్కా ప్లాన్ ప్రకారం బాలుడు యువతికి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఆ యువతిపై బాలుడు అత్యాచారం చేశాడు. అంతేకాదు ఆ బాలుడి స్నేహితులు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక వీరితో పాటు ఒక యువకుడు సైతం ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే యువతిపై అత్యాచారం చేసిన క్రమంలో బాలుడు ఆ పరిసరాల్లో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆ బాలుడిని ప్రశ్నించారు.
అనుమానంతో బాలుడ్ని ప్రశ్నించిన పోలీసులు ..వెలుగులోకి గ్యాంగ్ రేప్ ఘటన
బాలుడు చాలా కంగారుగా సమాధానం చెప్పాడు. సమాధానం విన్న తర్వాత పోలీసులు తమ మార్క్ విచారణ చేయడంతో బాలుడు అసలు విషయాన్ని బయట పెట్టాడు. దీంతో అత్యాచారానికి గురైన యువతిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఈ సామూహిక అత్యాచార ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అత్యాచారానికి పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని, ఒక యువకుడు ఉన్నారని అతని పేరు గురువిల్లి రమణ అని పోలీసులు పేర్కొన్నారు . ఇక వీరంతా జోడుగుళ్లపాలేనికి చెందిన వారని పేర్కొన్న పోలీసులు అత్యాచారానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
పతనమవుతున్న నైతిక విలువలు .. పిల్లల్లో పెరుగుతున్న క్రిమినల్ మైండ్ సెట్
రోజురోజుకు సమాజంలో ఇలాంటి ఘటనలు పెరుగుతూ పోవడంతో ఒక ఆందోళనకర వాతావరణం సమాజంలో చోటు చేసుకుంటుంది. మైనర్ బాలురు విచక్షణ మరచి యువతికి మత్తు మందు ఇచ్చి మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అంటే క్రిమినల్ మైండ్ సెట్ ఎంతగా పిల్లల్లో పెరుగుతుందో అర్థమవుతుంది. సమాజంలో రోజురోజుకీ దారుణంగా పరిణమిస్తున్న ఈ ఘటనలు తగ్గాలంటే పిల్లలకు పాఠశాల స్థాయి నుండి నైతిక విలువలతో కూడిన విద్యాబోధన చేయాల్సిన అవసరం ఉంది. చిన్నారుల్లో ఇలాంటి ప్రవృత్తిని పెంచుతున్న సామాజిక మాద్యమాలపై గట్టిగా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.