ఓలమ్మో.. ఇప్పుడేటి సేసేది..! శ్రీకాకుళంకు పాకిన కరోనా మహమ్మారి..! 3 పాజిటివ్స్ కేసులు నమోదు..!!
అమరావతి/హైదరాబాద్ : అయిపోయింది.. అనుకున్నదంతా అయిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఆ రెండు జిల్లాల దరి దాపులకు కరోనా వ్యాప్తి చెందలేదు, వ్యాప్తి చెందదు కూడా అని నిన్నటి వరకూ మొండి ధైర్యంగా ఉన్నారు ప్రజలు. కాని కరోనా మహమ్మారి ముందూ ఏదయినా పటాపంచలు కావాల్సిందేనన్న అంశం నేడు రుజువయ్యింది. కరోనా మహమ్మారికి ప్రాంతం, మతం, భాష ఏదీ కూడా అడ్డు కాదని నిరూపించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభించి నెల రోజుల తర్వాత శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి మూడు కేసులు వెలుగు చూడడం ఆందోళనకరంగా మారింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నిన్నటివరకూ ఒక్క కరోనా పాజిటీవ్ కేసు కూడా నమోదు కాలేదు.
భాష, ప్రాంతం, మతం అవసరంలేదని నిరూపించిన కరోనా.. శ్రీకాకుళంలో తొలిసారిగా 3 కేసులు..
దీంతో ఈ జిల్లాలకు ఇక కరోనా వ్యాపించడం అసాద్యం అనుకుంటున్న తరుణంలో గుండెలు గుబేలుమనే వార్త వెలుగు చూసింది. దీంతో ఉత్తరాంధ్ర ఒక్కసారిగా చిగురుటికులా వణికిపోతోంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజానికం సహజసిద్దంగా లభించే పసుపును విరివిగా ఉపయోగిస్తారని, పసుపులో వైరస్ ను అంతం చేసే రసాయనాలు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమనే చర్చ జరుగుతోంది. ఇంత వరకే ఉత్తరాంధ్రలోని ఈ రెండు జిల్లాలకు కరోనా వైరస్ సోకకపోడానికి కూడా ఇదే ప్రధాన కారణమని అక్కడి ప్రజానికం నమ్మకంతో ఉన్నారు. కాని ఉత్తరాంధ్ర ప్రజల నమ్మకాన్ని కరోనా మహమ్మారి పటాపంచలు చేసినట్టు తెలుస్తోంది.
ఏపిలో వెయ్యి దాటిన కేసులు.. ప్రభుత్వ వర్గాల్లో మొదలైన ఆందోళన..
ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఒక్కసారిగా మూడు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. పాతపట్నం మండలంలో ముగ్గురికి కరోనా సోకిందని ప్రభుత్వం కొద్ది సేపటి కిందట విడుదల చేసిన మెడికల్ బులిటెన్ లో పేర్కొంది. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులలో అనంతపురం జిల్లాలో 5 తూర్పుగోదావరి జిల్లాలో 3 ఉన్నాయి. అలాగే కృష్ణా జిల్లాలో25 కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 4 కేసులు ఈ రోజు కొత్తగా నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 14 కొత్త కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళంలో తొలి సారిగా మూడు కేసులు నమోదయ్యాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 61 మందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది.
రాదనుకున్న జిల్లాలకు వ్యాపించిన కరోనా... ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర..
అంతే కాకుండా రాష్ట్రంలో జిల్లాల వారిగా కరోనా కేసుల సంఖ్య పోల్చుకుంటే 275 కేసులతో కర్నూలు మొదటి స్థానంలో ఉండగా, 209 కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జిల్లాలపై ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇక, రాష్ట్ర రాజధానితో పాటు కృష్ణా జిల్లా విజయవాడలోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రం మొత్తంలో కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాని జిల్లాగా విజయనగరం ఉంది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1016కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో శనివారం ఒక్కరోజే కొత్తగా 61 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1016కు చేరుకుంది.
Recommended Video
ఆంక్షలు మరింత కఠినం.. కార్యాచరణ రూపొందిస్తున్న ఏపి సర్కార్..
ఇప్పటి వరకూ కరోనా రహిత జిల్లాలుగా ముద్ర వేసుకున్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు చిగురుటాకులా వణికిపోయే పరిస్థితులు తలెత్తాయి. శనివారం ఒక్కరోజే మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కళ్లెం విడిచిన గుర్రంలా పరుగెడుతున్నట్టు తెలుస్తోంది. కొత్తగా 61 కేసులు నమోదవడంతో, మొత్తం కేసుల సంఖ్య 1016కి చేరింది. వైరస్ బాధితుల్లో మరో ఇద్దరు చనిపోవడంతో, మొత్తం మృతుల సంఖ్య ముప్పై ఒక్కటికి చేరింది. ఇప్పటివరకూ 171 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా, ప్రస్తుతం ఎనిమిది వందల పద్నాలుగు మంది కరోనాతో ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కేసుల సంఖ్య పట్ల ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది.