విశాఖ రైల్వేస్టేషన్..సరికొత్త రూపం: గేమింగ్ జోన్ గా వెయిటింగ్ రూమ్!
విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వేస్టేషన్ సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. గేమింగ్ జోన్ గా అవతరించింది. స్టేషన్ ప్లాట్ ఫామ్ పైనుండే వెయిటింగ్ రూమ్ ను గేమింగ్ జోన్ గా మార్చారు అధికారులు. రైళ్ల కోసం ఎదురు చూసే సమయంలో కాలక్షేపం కోసం ప్రత్యేక క్రీడాపరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటిని వినియోగించుకోవడానికి గంటకు 50 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోని వాల్తేర్ రైల్వే డివిజనల్ మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ్ ఈ గేమింగ్ జోన్ ను ఆరంభించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫారంపై దీన్ని ఏర్పాటు చేశారు.
సెకెండ్ హ్యాండ్ బైక్ రేటు రూ.15 వేలు..చలాన్ 11 వేలు: లైటర్ తో బైక్ నిప్పంటించేశాడు
మనం ఎక్కాల్సిన రైలు వచ్చేంత వరకూ వాటి ద్వారా ఆటలు ఆడుకోవొచ్చు. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ క్లాంప్లెక్స్ లల్లో ఉండే గేమింగ్ జోన్ తరహాలోనే వాటిని కూడా తీర్చిదిద్దినట్లు చేతన్ కుమార్ తెలిపారు. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ నాన్ఫేర్ రెవిన్యూ ఐడియాస్ స్కీమ్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనిలో కార్ రేసింగ్, గన్ఫైటింగ్ తదితర వర్చువల్ గేమ్స్, హిట్ మౌస్, డొరేమాన్, డొరేమాన్ ఫ్రెండ్, మ్యూజికల్ ప్లే, బాస్కెట్బాల్, ఎయిర్ హాకీ వంటి గేమ్ లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి గేమ్కూ 50 రూపాయలను అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ సునీల్ కుమార్ తెలిపారు.
ఈ తరహా గేమింగ్ జోన్ ను ఏర్పాటు చేయడం భారతీయ రైల్వేలో ఇదే తొలిసారి. ప్రయాణికుల నుంచి లభిస్తోన్న ఆదరణను ఆధారంగా క్రమంగా.. ఇతర రైల్వేస్టేషన్లకు విస్తరిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. రైళ్ల రాకపోకల్లో జాప్యం చోటు చేసుకున్న సందర్భంగా ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతుంటారని, వారితో పాటు పిల్లలు కూడా ఉంటే..
ఆ అసహనం రెట్టింపు అవుతుంటుందని, దీన్ని నివారించడానికే ఈ ఏర్పాటు చేసినట్లు సునీల్ కుమార్ చెప్పారు. లాభ, నష్టాలతో సంబంధం లేకుండా ప్రయాణికుల సౌకర్యాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని గేమింగ్ జోన్ ను నెలకొల్పామని అన్నారు.