Vizag: రాజధాని కళ: ఆర్కే బీచ్-భీమిలీ మధ్య ట్రామ్వే రైలు?: డీపీఆర్ పై కసరత్తు..!
విశాఖపట్నం: విశాఖపట్నానికి రాజధాని కళ వచ్చేసింది. అధికారుల హడావుడి కనిపిస్తోంది. పరిపాలనను ప్రారంభించడానికి ప్రభుత్వం ముహూర్తాన్ని కూడా ఖరారు చేసిన నేపథ్యంలో.. ఈ తీర ప్రాంత నగరంలో సందడి నెలకొంటోంది. సచివాలయం సహా వివిధ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాల కోసం భవనాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారులు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) యంత్రాంగంతో కలిసి నగరంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో భవనాల ఆరా తీస్తున్నారు. దీనితో విశాఖ నగరంలో ఇదివరకు ఎప్పుడూ లేని వాతావరణం కొత్తగా కనిపిస్తోంది.
విశాఖపట్నం విమానాశ్రయం మూత పడుతుందా? అనుమానాలు వద్దన్న కేంద్రం
ట్రామ్వే రైలు కోసం కసరత్తు..
ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోన్న రామకృష్ణా బీచ్ నుంచి భీమిలీ వరకు ప్రత్యేకంగా ఓ ట్రామ్వే తరహా రైలు వ్యవస్థను ప్రభుత్వం తెర మీదికి తీసుకుని రానున్నట్లు తెలుస్తోంది. రామకృష్ణా బీచ్ నుంచి భీమిలీ బీచ్ మధ్య దూరం సుమారు 30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 30 కిలోమీటర్ల పొడవునా సముద్ర తీరం వెంట ట్రావ్వే తరహా రైలును తీసుకుని రావడం వల్ల రవాణా సౌకర్యం మెరుగు పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మున్సిపల్, పర్యాటక మంత్రిత్వ శాఖలకు బాధ్యతలు..
ట్రామ్వే తరహా రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రావడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యతలను ప్రభుత్వం.. మున్సిపల్, పర్యాటక మంత్రిత్వ శాఖలకు అప్పగించినట్లు చెబుతున్నారు. ఈ రెండు శాఖలు ఉమ్మడిగా ఓ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థల సేకరణ మొదలుకుని ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు వరకు పూర్తిస్థాయిలో నివేదికను ఈ రెండు శాఖలు సంయుక్తంగా రూపొందించనున్నాయి.
భీమిలీకి ఉద్యోగుల తాకిడి..
విశాఖపట్నం నగరం ఇప్పటికే జనసమ్మర్థంతో కిటకిటలాడుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్తగా పరిపాలనాపరమైన రాజధానిని తీసుకుని రావడం వల్ల జనం తాకిడి మరింత ఉధృతం అయ్యే అవకాశాలు ఉంటాయని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భీమిలీని మరింత అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, ఇందులో భాగంగా.. రెండు ప్రాంతాల మధ్య రవాణా వసతిని మెరుగుపర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.