రక్తమోడిన విశాఖ: లారీ బీభత్సం: ప్రమాద స్థలం భయానకం
విశాఖపట్నం: విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం హనుమంతవాక జంక్షన్లో అదుపు తప్పిన ఓ లారీ బీభత్సాన్ని సృష్టించింది. మృత్యువాహనంలా మారింది. వాహనదారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లారీ దూసుకెళ్లడంతో పలు బైక్లు, కార్లు ధ్వంసం అయ్యాయి. సంఘటనా స్థలం మొత్తం భీతావహంగా కనిపించింది. ధ్వంసమైన వాహనాలు, మృతదేహాలతో భయానకంగా మారింది. బ్రేకులు ఫెయిల్ అయిన లారీ ఈ బీభత్సానికి కారణమైంది.
సాధారణంగా హనుమంతవాక జంక్షన్ వాహనాలతో కిటకిటలాడుతుంటుంది. ఆదివారం కావడం వల్ల వాహనాల రద్దీ పెద్దగా కనిపించలేదు. మధురవాడకు బయలుదేరిన ఓ లారీ.. హనుమంతవాక జంక్షన్ వద్దకు చేరుకోగానే అదుపు తప్పింది. రెడ్ సిగ్నల్ వద్ద బ్రేకులు పడలేదు. అప్పటికే జంక్షన్ వద్ద నిలిచి ఉన్న వాహనాలపైకి వేగంగా దూసుకెళ్లింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను ఢీ కొట్టింది. జంక్షన్ వద్ద ఆగివున్న ఓ బైక్ను ఢీ కొట్టడంతో దానిపై ప్రయాణిస్తోన్నఇద్దరు సంఘటన స్థలంలోనే మృతిచెందారు.
Recommended Video
అక్కడితో ఆగలేదా లారీ. మరో రెండు కార్లను ఢీ కొట్టింది. దీనితో ఆ కార్ల ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ఓ కారు ఇంజిన్ పగిలిపోయింది. కారులో ప్రయాణిస్తోన్న నలుగురు గాయపడ్డారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. గాయపడ్డ వారిని 108 అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. లారీ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.