టీడీపీని వీడే ఆలోచనలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు .. బాబుకు షాక్ ఇచ్చే ఆ నేతలు ఎవరంటే ....
Recommended Video
గత ఎన్నికల్లో అధికారం కోల్పోయి, ఎవరూ ఊహించని విధంగా ఘోర పరాజయం పాలైన టిడిపి ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. మొన్నటికి మొన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేసి పార్టీకి గుడ్ బై చెప్తే, ఇక ఇప్పుడు మరికొందరు నేతలు సైతం టిడిపిని వీడాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం టీడీపీకి అటు అధికార పక్షంతోనే కాదు, ఇక స్వపక్ష నాయకుల వలసలతోనూ తలనొప్పి తయారైంది. ఇక తాజాగా సాగర తీర నగరమైన విశాఖలోనూ నేతలు పక్కచూపులు చూస్తున్నారు అన్న చర్చ టిడిపిని టెన్షన్ పెడుతోంది.
విశాఖ టీడీపీలో అంతర్యుద్ధం .... హాట్ టాపిక్ గా లేఖాస్త్రం .. పార్టీ శ్రేణుల్లో అంతర్మధనం...
గత ఎన్నికల్లో విశాఖలో నాలుగు స్థానాలలో విజయం సాధించిన టీడీపీ
ప్రతిపక్షంలో ఉన్న సమయంలోఏకతాటి మీద పని చేయాల్సిన నాయకులుఅలా కాకుండాఒకరికొకరు సహాయ నిరాకరణ చేస్తున్న పరిస్థితి విశాఖ నగరంలో ప్రధానంగా కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించిన విశాఖ నగరంలో మాత్రం కాస్తో కూస్తో టిడిపి తన మనుగడను చాటుకుంది. విశాఖ తూర్పు లో వెలగపూడి రామకృష్ణ బాబు, పశ్చిమలో గణబాబు ఉత్తరంలో గంటా శ్రీనివాసరావు, దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్ ఉంచారు. ఇక నలుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించిన విశాఖలో పార్టీని పటిష్టం చేయడానికి వీరు కృషి చేస్తారని పార్టీ అధిష్టానం భావించింది. కానీ అందుకు విరుద్ధంగా విశాఖ టిడిపిలో అంతర్గత విభేదాలు ముఖ్య నాయకులను పార్టీ వీడి వెళ్లేలా చేస్తున్నాయి.
పార్టీలో ఓ నేత తీరు వంశీ రాజీనామాకు కారణమని టీడీపీలో చర్చ
ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎవరు ఎంత బుజ్జగించినా వినకుండా పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వెళ్లడం వెనుక ప్రస్తుత ప్రభుత్వ వేధింపులు కారణమని చెప్పినప్పటికీ, పార్టీలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆధిపత్య పోరులో నలిగి పోవడం వల్లే వల్లభనేని వంశీ ఇంతగా నిర్ణయం తీసుకున్నారని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. వల్లభనేని వంశీ కి కృష్ణాజిల్లాలోని ఓ కీలక నేత, మాజీ మంత్రి తీరు నచ్చకనే పార్టీ వీడి వెళ్లారని పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. ఇక ఇప్పుడు అదే బాటలో విశాఖ టిడిపిలో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.
టీడీపీని వీడే యోచనలో ఎమ్మెల్యే గంటా
విశాఖ టీడీపీలోకి కీలక నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సైలెంట్ గానే ఉంటున్నారు. రాష్ట్రంలో టిడిపి కి ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా, టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా,టిడిపి నేతలపై కేసులు పెడుతున్నా గంటా శ్రీనివాస రావు మాట్లాడిన దాఖలాలు మాత్రం లేవు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే సైలెంట్ గా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే గంటా శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లాలా లేదా బిజెపి లోకి వెళ్లాలా అన్న దానిపై ఇంకా తర్జనభర్జన పడుతున్నారు. కానీ గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం పక్కానే అని ఆయన అనుచరులే బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
పక్క చూపులు చూస్తున్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి కుమార్
ఇక దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి కుమార్ సైతం పక్క చూపులు చూస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే వాసుపల్లి గణేష్ కుమార్ కు టిడిపి అర్బన్ అధ్యక్షుడు రెహ్మాన్ కు మాత్రం పొసగడం లేదట. దీంతో ఆయన విశాఖ నగరంలో టిడిపి చేపట్టే ఏ కార్యక్రమాలకు హాజరు కావడం లేదట. ఇక ఈ నేపథ్యంలోనే వాసుపల్లి గణేష్ కుమార్ సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. గతంలో వాసుపల్లి గణేష్ కుమార్ కు, విశాఖ అర్బన్ అధ్యక్షుడు ఎస్ ఏ రెహమాన్ కు మధ్య జరిగిన ఘర్షణలపై నారా లోకేష్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకొని ప్రచ్ఛన్నయుద్ధం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో వాసుపల్లి గణేష్ కూడా టిడిపిని వీడాలని ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.
విశాఖలో ఇద్దరు నేతలు పార్టీ మారతారని టీడీపీలో టెన్షన్
ఇక విశాఖ టీడీపీలో నడుస్తున్నకోల్డ్ వార్ పార్టీ శ్రేణులకు పెద్ద తలనొప్పిగా మారింది. అసలే గత ఎన్నికల్లో ఓటమి పాలై, అధికార పార్టీ ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుందని బాధపడుతున్న పార్టీ శ్రేణులకు పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. గత ఎన్నికలకు ముందు వరకు కీలకంగా వ్యవహరించిన గంటా శ్రీనివాసరావు పార్టీ మారాలని నిర్ణయం తీసుకోవడం, ఇప్పటికే బీజేపీలో కీలక నేత రామ్ మాధవ్ తో చర్చలు జరపడం, మరోపక్క వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పార్టీని వీడాలని పక్క చూపులు చూస్తూ ఉండడం విశాఖలో టిడిపి నేతలు షాక్ ఇవ్వబోతున్నారు అన్న వార్తలకు ఊతమిస్తోంది. ఏదేమైనా గన్నవరంలో మొదలైన రాజకీయ ప్రకంపనలు తెలుగుదేశం పార్టీలో విశాఖ తీరంలోనూ కనిపిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ మొదలైంది. మరి ఇంతకీ వీరు పార్టీ మారతారా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.