ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిని మార్చివేసింది. ఇదివరకు గాడు చిన్ని వెంకట కుమారిని తొలగించింది. తాజాగా వేపాడ చిరంజీవి రావు పేరును ఖరారు చేసింది.
విశాఖపట్నం: మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా బదలాయించడానికి సన్నాహాలు చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మార్చి 22వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారనే ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల ఏర్పాటును ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఇప్పుడున్న అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని పట్టుబట్టుతోంది.
సీజేఐ డీవై చంద్రచూడ్ కొత్త టీమ్..!!
ప్రతికూల పరిస్థితుల్లో..
విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోన్న నేపథ్యంలో- ఈ ప్రాంతంపై పట్టు కోల్పోయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. తన బినామీల ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తోన్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు. దీనికి అనుగుణంగానే అక్కడి రాజకీయ పరిస్థితులు కూడా టీడీపీకి ప్రతికూలంగా మారాయని చెబుతున్నారు.
శాసన మండలి ఎన్నికల్లో..
ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతోంది.. శాసన మండలి ఎన్నికల రూపంలో. ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది టీడీపీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికను గెలిచి తీరాల్సి ఉంటుందని, దీని ఉత్తరాంధ్ర జిల్లాలపై తనకు ఉన్న పట్టును నిరూపించుకోవాలని భావిస్తోంది.
అభ్యర్థి మార్పు..
దీనికి అనుగుణంగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఈ క్రమంలో అభ్యర్థిని మార్చేయడానికీ వెనుకాడట్లేదు. ఇప్పుడదే జరిగింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి ఇదివరకు ప్రకటించిన మహిళా అభ్యర్థి గాడు చిన్ని కుమారి లక్ష్మి తొలగించింది. ఆమె స్థానంలో వేపాడ చిరంజీవి రావు పేరును తెర మీదికి తీసుకొచ్చింది. ఆయనను తమ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ.
వేపాడ..
ఈ మేరకు టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆయన పేరును ప్రకటించారు. పార్టీ కండువా కప్పి ఆయన అభినందనలు తెలియజేశారు. ఇదివరకు గాడు చిన్ని కుమారి లక్ష్మిని గెలిపించాలని కోరుతూ ప్రముఖ నటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా ప్రచారం సైతం చేశారు. గాడు చిన్నిని గెలిపించాలని కోరుతూ సెల్ఫీ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మార్చి 29న పోలింగ్..
ఇప్పుడు తాజాగా గాడు చిన్ని వెంకటకుమారి స్థానంలో చోడవరం నియోజకవర్గానికి చెందిన నాయకుడు వేపాడ చిరంజీవి రావు తెర మీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది శాసనమండలిలో మొత్తంగా 23 స్ధానాలు ఖాళీ కానున్నాయి. వాటిని భర్తీ చేయడానికి మూడు విడతల్లో ఎన్నికలను షెడ్యూల్ చేశారు. మార్చి 29వ తేదీన తొలి విడత పోలింగ్ ఉంటుంది. ఈ విడతలోనే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి పోలింగ్ షెడ్యూల్ అయింది.